
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ దేశంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత దేవుడిలా ఆరాధించే క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే ధోని మాత్రమే. మైదానంలో భద్రతా సిబ్బందిని దాటుకుని వచ్చి క్రీజులో ఉన్న ధోని కాళ్లకు అభిమానులు మొక్కిన సంఘటనలు ఎన్నో.
తాజాగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి చెన్నై తొలుత బ్యాటింగ్ ప్రారంభించింది. 11 ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఆ సమయంలో ధోనీ డగౌట్లో ఉన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
చెన్నై బ్యాటింగ్ కోచ్ హస్సీతో ఏదో మాట్లాడుతుండగా ఎలా వచ్చాడో ఓ అభిమాని ధోనీ వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించాడు. ఇంతలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ యువకుడిని తీసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు తమ ట్విటర్ అభిమానులతో పంచుకున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్లో కోల్కతా ఆటగాళ్లలో శుభ్మాన్ గిల్(57 నాటౌట్; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్(45 నాటౌట్; 7ఫోర్లు,1 సిక్స్)లు రాణించడంతో చెన్నై సూపర్కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ధోని 25 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 11వ సీజన్లో ఇలాంటి సన్నివేశం చోటు చేసుకోవడం ఇది రెండోసారి. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ ధోనీ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో ఓ అభిమాని వచ్చి ధోని కాళ్లకు నమస్కరించి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.