
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 మ్యాచ్ల్లో 349 పరగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో చెన్నై ఆటగాడు అంబటి రాయుడు (370 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా కోహ్లీ ఖాతాలో మరో ఘనతను సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏప్రిల్ 7 నుంచి మే 1వ తేదీ వరకు జరిగిన మ్యాచ్లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధిక సింగిల్స్ తీసిన బ్యాట్స్మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడిన కోహ్లీ 349 పరుగులు సాధించాడు. ఇందులో 113 పరుగులు వికెట్ల మధ్య సింగిల్స్ ద్వారా వచ్చినవే కావడం విశేషం. ఆ తర్వాత అంబటి రాయుడు(108), కేన్ విలియమ్సన్ (103) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత స్థానాల్లో సంజు శాంసన్(84), రహానే(80)లు ఉన్నారు. ఐపీఎల్ 11వ సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమితో ప్రారంభించింది. ఆ తర్వాత కొంతమేరకు పుంజుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో బెంగళూరు ఆడిన 8 మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
లీగ్ దశలో బెంగళూరు జట్టు ఆడనున్న మిగతా ఆరు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు చేరుకోగలదు. ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా మే 5న చెన్నై సూపర్కింగ్స్తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్కి ఫూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.