హైదరాబాద్: ఫీల్డ్ అంపైర్ని ఆట పట్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ టిమ్ సౌథీ మందలింపుని ఎదుర్కొన్నాడు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో హేల్స్ క్యాచ్ ఔట్పై థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల సౌథీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సన్రైజర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ యార్కర్ రూపంలో బంతిని విసరగా, దానిని బ్యాట్స్మెన్ మనీశ్ పాండే స్ట్రైట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా దొర్లుకుంటూ వెళ్లి సౌథీ చేతికి చిక్కింది. అప్పటికే పరుగు కోసం నాన్స్ట్రైక్ ఎండ్ నుంచి కొంచెం దూరం ముందుకు వచ్చిన విలియమ్సన్ రనౌట్ అవుతానని గ్రహించి తిరిగి క్రీజులోకి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో ఆలస్యంగా స్పందించిన టిమ్ సౌథీ అంపైర్ని ఆట పట్టించే ఉద్దేశంతో బెయిల్స్ను పడగొట్టి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్యాచ్ ఔట్పై నిర్ణయాన్ని తప్పుబట్టాడు. దీనిని పరిగణనలోకి తీసుకున్న మ్యాచ్ రిఫరీ సౌథీ ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి తప్పాడని ఓ ప్రకటనని విడుదల చేశాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఆర్టికల్ 2.1.8 కింద లెవల్-1 తప్పిదానికి పాల్పడినట్లు తేలడంతో సౌథీని మందలింపుతో సరిపెట్టామని అందులో పేర్కొన్నారు. ఇందులో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం అన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు డివిలియర్స్ (69), మొయిన్ అలీ (65), గ్రాండ్ హోమ్ (40) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.