హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం సర్వం సన్నద్ధమైంది. ఈ సీజనులో తొలిసారిగా జరగనున్న ఈ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
బెంగళూరు జట్టు సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. గత వారం రోజుల నుంచి రాత్రివేళల్లో నగరంలో వర్షం కురుస్తోంది. దీంతో.. ఈ మ్యాచ్కి కూడా వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు.
రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. మొదటి మ్యాచ్ నుంచీ జోరు కొనసాగిస్తూనే వస్తోంది. చెన్నై ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో.. నాలుగింట గెలుపొంది పాయింట్ల పట్టకిలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఆరో స్థానం ఉంది.
ఇప్పటివరకూ ఇరు జట్లు ఐపీఎల్లో 21సార్లు తలపడగా, అందులో చెన్నై 13సార్లు గెలవగా, బెంగళూరు 7సార్లు విజయం సాధించింది. ఒక్క మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక, బెంగళూరు వేదికగా జరిగిన ఏడు మ్యాచ్లలో చెన్నై మూడింట గెలవగా, బెంగళూరు మూడు సార్లు విజయం సాధించింది.
మిగతా మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీస్తే ఐపీఎల్లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు. టోర్నీలో భాగంగా గత శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో.. రెండు వరుస పరాజయాల తర్వాత బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే.