హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం మే 23, 25న జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్ వేదికలను మార్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్లు పూణెలో జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మ్యాచ్లను కోల్కతాకు తరలించారు. కావీరే జల వివాదం నేపథ్యంలో చెన్నై సూపర్కింగ్స్ సొంతగడ్డ చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్లను ఇప్పుడు పూణె వేదికగా ఆడుతోన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ నేపథ్యంలోనే పూణెలో జరపాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2ను మ్యాచ్లను కోల్కతాకు తరలించారు. భారత్లో అతిపెద్ద స్టేడియమైన ఈడెన్ గార్డెన్స్ 66,000 మంది వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. పూణెతో పోల్చుకుంటే ఈడెన్ గార్డెన్స్ అభిమానులకు సౌకర్యంగా ఉంటుందని ఐపీఎల్ నిర్వాహకులు ఈ రెండు మ్యాచ్లను కోల్కతాకు తరలించారు.
'క్వాలిఫైయర్-1లో వేదికలో ఎలాంటి మార్పులు లేవు. కొన్ని కారణాల వల్ల పూణెలో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్లను మాత్రం ఈడెన్ గార్డెన్స్లో నిర్వహిస్తాం. మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్కి షెడ్యూల్ ప్రకారం ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే జరగనుంది' అని ఐపీఎల్ అధికారులు తెలిపారు.