హైదరాబాద్: ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్లో లీగ్ దశ ముగిసింది. లీగ్ దశలో భాగంగా చివరి మ్యాచ్లో కింగ్స్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ప్లేఆఫ్స్కు చేరాలన్న కింగ్స్ పంజాబ్ ఆశలు నెరవేరలేదు.
ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్కు చేరగా... ఆదివారం నాటి మ్యాచ్లతో కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్ప్కు చేరాయి. ఈ సీజన్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. టాప్-5లో నిలిచిన బౌలర్లు తమ జట్లను ప్లేఆఫ్ప్కు చేర్చడంలో విఫలమయ్యారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
లీగ్ దశ ముగిసే సరికి బౌలర్ల అత్యుత్తమ గణాంకాల ప్రకారం చూస్తే ఆండ్రూ టై(24 వికెట్లు-కింగ్స్ పంజాబ్) తొలి స్థానంలో ఉండగా, ఉమేశ్ యాదవ్(20 వికెట్లు-బెంగళూరు) రెండో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్(18 వికెట్లు-ఢిల్లీ) మూడో స్థానంలో హార్ధిక్ పాండ్యా(18 వికెట్లు-ముంబై) నాలుగో స్థానంలో ఉండగా, బూమ్రా(17 వికెట్లు-ముంబై) ఐదో స్థానంలో నిలిచాడు.
వీరంతా ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు. వీరు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, వారు ఆడిన జట్లు మాత్రం లీగ్ మ్యాచ్ల వరకే పరిమితమయ్యాయి. ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. గత సీజన్లలో లీగ్ దశ ముగిసేసరికి టాప్-5లో నిలిచిన బౌలర్ల జట్లు ప్లేఆఫ్స్కు చేరుకునేవి.
అయితే ఈ సీజన్లో మాత్రం ఒక జట్టు కూడా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు చెందిన బౌలర్ ఆండ్రూ టై(24 వికెట్లు) నిలిచాడు. ఈ సీజన్లో ఆండ్రూ టై 24 వికెట్లతో అదరగొట్టినప్పటికీ కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకోలేకపోయింది.