
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాండ్యా సోదరులు ఆల్రౌండర్ ప్రదర్శనతో ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు.
బ్యాటింగ్కి అనుకూలించిన పిచ్పై 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా జట్టుని రెండు అద్భుతమైన రనౌట్లతో పాండ్యా సోదరులు ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో కోల్కతా 108 పరుగులకే ఆలౌటైంది. ఫలితం కోల్కతాపై ముంబై ఇండియన్స్ 102 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ విజయం ముంబై ఇండియన్స్కి ఈ సీజన్లో వరుసగా మూడో విజయం కాగా, కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై వరుసగా ఎనిమిదో విజయం కావడం విశేషం. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్కతా సంక్షిష్టం చేసుకుంది.
ఛేదనకు దిగిన కోల్కతా జట్టు 3.5 ఓవర్లు ముగిసే సమయానికి 32/1తో మెరుగైన స్థితిలో ఉంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఓపెనర్ క్రిస్లిన్ (21) ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. నాలుగో ఓవర్ వేసిన కృనాల్ పాండ్య తెలివైన రనౌట్తో క్రిస్లిన్ని బోల్తా కొట్టించాడు.
కృనాల్ విసిరిన బంతిని రాబిన్ ఉతప్ప ఆడగా అది నేరుగా ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోకి వెళ్లింది. తొలుత పరుగు కోసం ప్రయత్నించిన ఊతప్ప.. మళ్లీ వెనక్కి తగ్గగా, నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న క్రిస్ లిన్ క్రీజు వదిలి చాలా దూరం ముందుకు వెళ్లిపోయాడు. బంతి అందుకున్న కృనాల్ వెంటనే వికెట్లను గీరాటేయడంతో క్రిస్లిన్ నిరాశగా పెవిలియన్కు చేరాడు.
ఆ తర్వాత ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనూ మరోసారి కోల్కతా బ్యాట్స్మెన్ ఇలానే తొందరపడి రనౌటయ్యాడు. విజయానికి 66 బంతుల్లో 144 పరుగులు చేయాల్సిన దశలో హార్దిక్ పాండ్యా విసిరిన బంతిని.. నితీష్ రానా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా నెట్టి పరుగు కోసం ప్రయత్నించి మళ్లీ వెనక్కి తగ్గాడు.
నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న కెప్టెన్ దినేశ్ కార్తీక్ తొందరపడి క్రీజు వదిలి ఎక్కువ దూరం ముందుకు వెళ్లిపోవడంతో రనౌటయ్యాడు. జేపీ డుమిని విసిరిన బంతిని పాండ్యా వికెట్లను గిరాటేశాడు. దీంతో కోల్కతా ఓటమి దాదాపు ఖాయమైంది. ఛేదనలో ఇద్దరు కోల్కతా బ్యాట్స్మెన్లు రనౌట్ల రూపంలో వెనుదిరగడంతోనే కోల్కతా ఓటమి పాలైంది.