
హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.
ఫలితంగా మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ సరసన చెన్నైనిలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్, 11ఫోర్లు, 8సిక్స్లు) అద్భుత సెంచరీతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (47), యూసుఫ్ పఠాన్ (45 నాటౌట్), ధవన్ (26) చెలరేగారు. చెన్నై బౌలర్లలో శార్దుల్, కర్ణ్శర్మ, బ్రావో, జడేజా, ఎంగ్డీ ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్లో సెంచరీతో అజేయంగా నిలిచిన షేన్ వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన షేన్ వాట్సన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
'చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు అభినందనలు. ప్రపంచంలోనే పెద్ద టీ20 టోర్నమెంట్గా గుర్తింపు పొందిన ఐపీఎల్ టైటిల్కు మీరు అర్హులు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న చెన్నై ఆటగాళ్లకు శుభాభినందనలు. ఈ విజయం తమిళనాడు ప్రజలందరికీ చెందుతుందంటూ' సెహ్వాగ్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
'ఈ సీజన్లో సన్రైజర్స్ ఆటతీరు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. మమ్మల్ని పోత్సహించిన అభిమానులకు, సన్రైజర్స్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. షేన్ వాట్సన్ చాలా అద్భుతంగా ఆడాడు. మీరు(సీఎస్కే) ఈ విజయానికి అర్హులు' అంటూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.