
హైదరాబాద్: కోచ్, మెంటార్ ప్రోత్సాహంతోనే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేయగలిగానని సన్రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలిపాడు. వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ 'ఫామ్ అందుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది. గత రెండు మ్యాచ్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న తర్వాత వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆటలో ఇలాంటివి సహజం. ప్రతి ఆటగాడికి అతని జీవితంలో కొన్ని గడ్డు రోజులుంటాయి' అని అన్నాడు.
'అయితే వాటిని సానుకూలంగా మార్చుకొని ముందుగా సాగాలని కోచ్, మెంటార్ నన్ను దగ్గరుండి ప్రోత్సహించారు. వాళ్లు చెప్పిన మాటలనే ముంబైతో మ్యాచ్లో ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాన్ని రాబట్టా' అని రషీద్ ఖాన్ అన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇందులోనూ ఒక ఓవర్ మెయిడిన్. దీనికి తోడు సరైన సమయంలో ముంబై కీలక ఆటగాళ్లు కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ను పెవిలియన్కు చేర్చి సన్రైజర్స్ విజయంలో స్పిన్నర్ రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ను.. సన్రైజర్స్ బౌలర్లు కట్టడి చేయడంతో 20 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. దీంతో సన్రైజర్స్ 31 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లలో రషీద్ ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా పంజాబ్తో మ్యాచ్లో క్రిస్ గేల్ అయితే రషీద్ ఖాన్ను లక్ష్యంగా చేసుకుని పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే.