హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్లో భాగంగా హైదరాబాద్ స్సిన్నర్ షకిబ్ ఉల్ హసన్ 12 ఓవర్ను వేశాడు. తొలి బంతికి పంజాబ్ ఆటగాడు కరుణ్ నాయర్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు.
బౌండరీ లోపలే క్యాచ్ని అందుకున్న మనీష్ పాండే దానిని నియంత్రించుకునే క్రమంలో బంతిని గాల్లోకి విసిరాడు. అయితే ఈ బంతి తిరిగి మైదానంలోకి కాకుండా గ్యాలరీలో పడింది. దీంతో క్యాచ్ కాస్తా సిక్సుగా మారింది. ఈ సన్నివేశం మంచి వినోదాన్ని ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, గురువారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. హైదరాబాద్ ఆటగాళ్లలో విలియమ్సన్(54), పాండే(57 నాటౌట్), షకీబ్(24 నాటౌట్) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.
194 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్లో ఎదుర్కొన్న తొలి బంతికి శిఖర్ ధావన్ గాయపడటంతో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా(6) తొలి వికెట్గా ఔట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది.
ఆ తర్వాత యూసఫ్ పఠాన్(19) సైతం నిరాశపరిచాడు. ఆ తరుణంలో విలియమ్సన్-మనీష్ పాండే జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత విలియమ్సన్ ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 193 పరుగులు నమోదు చేసింది.