
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ధోని ఔటవ్వాలని తాను కోరుకున్నట్లు కోల్కతా యువ ఆటగాడు శుభ్మాన్ గిల్ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై-కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ధోనీ ఇచ్చిన క్యాచ్ను శుభ్మాన్ గిల్ వదిలేశాడు. దీనిపై మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్తో కలిసి బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడాడు. 'నాకు సొట్టబుగ్గలున్నాయి. మా అమ్మకు కూడా ఉన్నాయి. నాకు దినేశ్ కార్తీక్లా గడ్డం పెంచుకోవాలని ఉంది' అని గిల్ తెలిపాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'4వ స్థానంలో వచ్చి బ్యాటింగ్ చేయడం ఓ కొత్త అనుభవం. ఈ మ్యాచ్లో నేను చేసిన పరుగులు నాలో ఆత్మవిశ్వాశాన్ని నింపాయి. బౌండరీ లైన్ వద్ద ధోనీ ఇచ్చిన క్యాచ్ను వదిలేశాను. ఆ సమయంలో నావైపు ఎవరూ కోపంగా చూడకపోయినా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాతి బంతికి ధోనీ ఔటవ్వాలని కోరుకున్నాను' అని చెప్పాడు.
'అప్పుడు ధోనీ కొట్టిన మరో బంతి నా వైపే వచ్చింది. దాన్ని బౌండరీ వెళ్లనీయకుండా ఆపాలనుకున్నాను. క్యాచ్ను వదిలేయడంతో నాపై ఒత్తిడి పెరిగింది. జట్టు కోసం ఎలాగైనా మ్యాచ్ను గెలిపించాలనుకున్నాను. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే నేను విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చేది' అని శుభ్మాన్ గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాను గిల్ 57 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అండర్-19 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్మాన్ గిల్ను జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ దక్కించుకుంది.
ప్రస్తుతం కోల్కతా నైట్రైడర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలను నమోదు చేసుకుంది. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్తో తలపడనుంది.