
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్(117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో మూడో ట్రోఫీని అందుకున్న రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన ఘతన సాధించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు (2013, 2015, 2017)లో మూడు సార్లు ట్రోఫీని అందుకుంది.
తద్వారా అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. 2009లో రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ నాలుగు సార్లు ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు.
అయితే, ఆదివారం జరిగిన పైనల్లో సన్రైజర్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడంతో ఇప్పుడు అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ కూడా రోహిత్ శర్మ సరసన నిలిచారు. రోహిత్ శర్మతో పాటు అత్యధిక ఐపీఎల్ టైటిళ్లు నెగ్గిన ఆటగాళ్ల(నాలుగు సార్లు) జాబితాలో ఈ ఇద్దరు కూడా చేరారు.
ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు ట్రోఫీలు నెగ్గినప్పుడు హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అంబటి రాయుడు నాలుగో స్థానంలో నిలిచాడు.
ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లాడిన అంబటి రాయుడు 43 యావరేజితో 602 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, ఈ సీజన్లో హర్భజన్ సింగ్ ప్రదర్శన ఏమంత బాగా లేదు. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్లాడిన భజ్జీ కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.