
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఫైనల్స్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు కూర్పును చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ను కాదని, ఏ మాత్రం అనుభవం లేని కర్ణ్ శర్మకు తుది జట్టులో ధోని కల్పించడం వల్ల. అయితే, తుది జట్టులో ధోని భజ్జీకి చోటు కల్పించక పోడవం వెనుక ఏదో బలమైన కారణం ఉందని, అభిమానులకు ఇప్పటికీ అదొక సందేహంగానే ఉంది. తాజాగా, భజ్జీ దీనిపై వివరణ ఇచ్చాడు.
'ఫైనల్ మ్యాచ్లో ధోనీ వ్యూహం ప్రకారం బ్యాట్స్మెన్కు దూరంగా బంతులేసే బౌలర్ కావాలి. ఫింగర్ స్పిన్నర్లతో చూసుకుంటే మణికట్టు స్పిన్నర్లు ఐపీఎల్లో చాలా ఎక్కువ ఓవర్లు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్లో ఈ పరిస్థితి మారుతుందని భావిస్తున్నా' అని తెలిపాడు.
'ధోనీ ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తాడు. అతనిపై ఆ నమ్మకం ఉంది. అందుకే ఫైనల్ ఆడే తుది జట్టులో చోటు దక్కకపోయినా నేను ఏమాత్రం బాధపడలేదు. తుది జట్టులో చోటు దక్కించుకుని కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన కర్ణ్ శర్మకు అభినందనలు' అని హర్భజన్ అన్నాడు.
హార్భజన్ సింగ్, కర్ణ్ శర్మ ఇద్దరూ వరుసగా ఐపీఎల్ ట్రోఫీని రెండోసారి ముద్దాడటం విశేషం. గతేడాది ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఐపీఎల్ పదో సీజన్ ట్రోఫీని రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తద్వారా నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆటగాడిగా హర్భజన్ అరుదైన ఘనతను సాధించాడు. గతేడాది వరకు ముంబై ఇండియన్స్కు ఆడిన హర్భజన్ సింగ్ని ఈ ఏడాది వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 13 మ్యాచ్లాడిన భజ్జీ 7 వికెట్లు తీశాడు.
కాగా, వాంఖడె స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో షేన్ వాట్సన్ అజేయ సెంచరీతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.