
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ను ఘనంగా ఆరంభాలని ఢిల్లీ డేర్డెవిల్స్ కొత్త కెప్టెన్తో బరిలోకి దిగింది. అంతేకాదు ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో డబ్బు విషయంలో రాజీ పడకుండా జేసన్ రాయ్, కొలిన్ మున్రో, గ్లెన్ మ్యాక్స్వెల్, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఆటగాళ్లను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఇంతమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, ఈ సీజన్లో ఆ జట్టు పేలవ ప్రదర్శనే కనబరుస్తోండటం విశేషం. ఇప్పటివరకు ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో ఢిల్లీ పేలవ ప్రదర్శనపై అభిమానులు తమ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలవ ప్రదర్శనపై అభిమానులు సోషల్మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీపై చేస్తోన్న విమర్శలపై తాజాగా ఓ వార్తాపత్రికకకు రాసిన కథనంలో గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
'ప్రస్తుతం మన శరీరంలో ఒక కొత్త అవయవం వచ్చి చేరింది. అదే స్మార్ట్ఫోన్. ప్రస్తుతం భారత్లో 490 మిలియన్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. చాలా మంది సోషల్మీడియాలో తమకు నచ్చిన విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది షమీని తప్పించి.. ఆవేశ్ఖాన్ను ఆడించాలంటారు. విజయ్ శంకర్ స్థానంలో పృథ్వీ షాను తుది జట్టులోకి తీసుకోవాలంటారు. మరోవైపు ఢిల్లీ పేరులో డీలు ఎక్కువున్నాయని.. డీ అంటే డిఫీట్(ఓటమి) ఇది శుభసూచకం కాదని కొంతమంది పేర్కొంటున్నారు' అని గంభీర్ తన కథనంలో వివరించారు.
'ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలవడంతో ఢిల్లీ డేర్డెవిల్స్పై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రోల్స్, హిట్స్, ఫాలోవర్స్, లైక్స్తో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మా జట్టు ఏదో పెద్ద నేరం చేసినట్లు అనిపిస్తోంది. మా స్పందనను బట్టి మేం బాధ పడట్లేదని అనుకోవద్దు' అని గంభీర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
'గత రెండు మ్యాచ్ల్లో వరుసగా 200కు పైగా పరుగులు చేశాం. ముంబై ఇండియన్స్పై విజయం సాధించాం. కానీ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలయ్యాం. నేను ఒప్పుకుంటా. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఇంకాస్త కాంపిటేటివ్గా ఆడాల్సి ఉంది. అయితే, మీ స్మార్ట్ ఫోన్లో చదివి మమ్మల్ని వేరేలా భావించొద్దు' అని గంభీర్ ఆవేదన వ్కక్తం చేశాడు.
కెప్టెన్సీలో అపార అనుభవం ఉన్న గౌతమ్ గంభీర్తో పాటు ఢిల్లీ జట్టులో జేసన్ రాయ్, గ్లెన్ మాక్స్వెల్, ట్రెంట్ బౌల్ట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ జట్టు సమష్టిగా అన్ని విభాగాల్లో రాణించకపోవడంతో ఆ జట్టు పరాజయాలను ఎదుర్కొంటోంది. కనీసం రాబోయే మ్యాచ్లోనైనా విజయం సాధించాలని గురువారం ఢిల్లీ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్లో చెమటోడ్చారు.