
హైదరాబాద్: ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు ముంబై స్టేడియంలో ఏర్పాట్లు మొదలైయ్యాయి. ఇదిలా ఉంటే వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటారని ఖరారు చేసిన సెలబ్రిటీలు వేడుకకు దూరమవుతున్నారు. ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి రణవీర్ సింగ్, ధావన్, పరిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్లను ఖరారు చేశారు నిర్వహకులు.
ఇందులో పాల్గొనేందుకు రణవీర్ సింగ్ భుజానికి గాయం తగలడంతో బరువుతో కూడిన పనులేవి చేయొద్దంటూ వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అతను డ్యాన్స్ చేసేందుకు వీలుగా లేడని అతని ప్రతినిధి వెల్లడించాడు. దాంతో ప్రత్యామ్నాయంగా ఖర్చు ఎక్కువైనా సరే రణవీర్ సింగ్ స్థానంలో హృతిక్ రోషన్ను బుక్ చేసుకుంది ఐపీఎల్ యాజమాన్యం.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఇప్పుడు వాళ్లకు మరో కష్టం వచ్చి పడింది. తాజాగా తనకు సమయం కుదరడం లేదంటూ పరిణీతి చోప్రా సైతం సైడ్ అయిపోయింది. సినిమాలతో బిజీగా ఉన్న పరిణీతి చోప్రా షెడ్యూల్లో ఖాళీ దొరకకపోవడంతో ప్రాక్టీస్ చేయలేకపోయిందట. దీంతో ఐపీఎల్ ప్రదర్శన నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎనిమిది కెప్టెన్లలో కేవలం ఇద్దరే అందుబాటులో ఉంటుండగా వేడుకలలో జోష్ ను ఎలా నింపాలా అనే ఆలోచనలోపడింది ఐపీఎల్ నిర్వహక సంఘం.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నిడివి సుమారు 90 నిమిషాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తొలి మ్యాచ్ జరిగే రోజునే వేడుకలు జరపనుండటంతో మ్యాచ్ టాస్ వేయడానికి 15నిమిషాల ముందే కార్యక్రమం ముగిసేలా ఏర్పాట్లు చేయనున్నారు.