హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ట్రోఫీ చెన్నై సూపర్ కింగ్స్దే అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్. తాజాగా మంగళవారం ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో డివిలియర్స్ మాట్లాడుతూ 'ఐపీఎల్ ఫైనల్స్ ఏయే జట్ల మధ్య జరుగుతుందో చెప్పడం కష్టం. మీరు ఏ జట్టు గెలుస్తుందో ఊహించమంటున్నారు కాబట్టి ఫైనల్స్లో చెన్నై-హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్లో ధోని తన మ్యాజిక్తో చెన్నై జట్టుని గెలిపిస్తాడు' అని అన్నాడు.
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనపై కూడా డివిలియర్స్ స్పందించాడు. 'ఎవరిపై ఫిర్యాదులు లేవు. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి నన్ను ఎంతో నిరాశకు గురి చేసింది. ఒకానొక దశలో లక్ష్య చేధనను అలవోకగా చేధిస్తామని అనుకున్నాం. కానీ, స్వల్ప ఓవర్లలోనే రాజస్థాన్ స్పిన్నర్లు మార్చి మొత్తాన్ని మార్చేశారు' అని అన్నాడు.
'ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో ఆరింట విజయం సాధించడం నిజంగా నిరాశకు గురిచేసింది. అయితే, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. నేను నమ్ముతున్నాను. ఈ సీజన్లో మా ప్రదర్శన అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. 2019 సీజన్కు అద్భుతమైన ఫౌండేషన్తో వస్తాం' అని అన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ఓడిపోయింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
165 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు జట్టు స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ (4/16) ధాటికి 19.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ ఓటమితో కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.