
హైదరాబాద్: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాట్స్మెన్లలో డివిలియర్స్ (39 బంతుల్లో 69), మొయిన్ అలీ (34 బంతుల్లో 65), గ్రాండ్హోమ్ (17 బంతుల్లో 40) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఏబీ డివిలియర్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం ఏబీ డివిలియర్స్ సొంత మైదానంలో మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. స్టాండ్స్లోని ప్రేక్షకుల వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు, ఓ లక్కీ ఫ్యాన్కు సావనీర్ అందజేశాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
అంతకుముందు డివిలియర్స్ మాట్లాడుతూ...'మైదానంలోని ప్రేక్షకులు డివిలియర్స్...డివిలియర్స్ అంటుంటే ఆ ఫీలింగ్ ఎంతో గొప్పగా ఉంది. బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టాను. ప్లేఆఫ్కు చేరువవ్వడం ఎంతో సంతోషంగా ఉంది' అని అన్నాడు.
ఈ మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ బౌండరీ లైన్ వద్ద అందుకున్న ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బౌలర్ మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతిని అలెక్స్ హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డివిలియర్స్ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్ను ఒంటి చేత్తో అందుకున్నాడు.
ఆ క్రమంలోనే బౌండరీ లైన్ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఏబీ సెన్సేషనల్ క్యాచ్తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది. డివిలియర్స్ ఒంటి చేత్తో అంత ఎత్తు ఎగిరి మరీ పట్టిన క్యాచ్ పట్ల క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సైతం ప్రశంసల వర్షం కురిపించారు.
ఏబీని సూపర్ మ్యాన్తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు స్పైడర్ మ్యాన్ను లైవ్లో చూశానంటూ ఏబీ క్యాచ్ అందుకుంటున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు.