భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్

కరాచీ: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్లు ఉన్నారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ఇక ఆసీస్ను సొంత గడ్డపై భారత్ ఓడించడం అద్భుతమని, తన జీవితంలో ఇలాంటి సూపర్ టీమ్ను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. బోర్డర్-గావస్కర్ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమామ్.. భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద విజయం ఎప్పుడూ లేదని, భారత జట్టు ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించినా అందులో ఇది మాత్రం ప్రత్యేకమన్నాడు.

మాములు విషయం కాదు..
టెస్టుల్లో అనుభవమే లేని ఆటగాళ్లు ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం మాములు విషయం కాదని ఈ పాక్ మాజీ సారథి ప్రశంసించాడు. 'మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్.. ఇలా ఈ సిరీస్లో రాణించిన ఎవరికీ పెద్దగా అనుభవం లేదు. పైగా టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 330 పరుగులు చేయడం అంత తేలిక కాదు. కోహ్లీ, బుమ్రా, అశ్విన్, జడేజా లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా చివరి మ్యాచ్లో యువకులు బాగా ఆడారు. డ్రా గురించి ఆలోచించకుండా గెలుపుకోసం ఆడటం ప్రశంసనీయం. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె నాయకుడిగా సత్తా చాటాడు.

రాహుల్ ద్రవిడే కారణం
మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైని, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ రాణించడానికి భారత దిగ్గజం రాహుల్ ద్రవిడే కారణం. ఈ ఆటగాళ్లంతా భారత్-ఏ, అండర్-19 జట్లకు ఆడే క్రమంలో ద్రవిడ్ కోచ్గా ఉన్నాడు. అతని బలమేంటనేది 'ది వాల్' పేరే చెబుతుంది. ఏ పరిస్థితిలోనైనా ఆడగల సత్తా అతని సొంతం. మానసికంగా దృఢమైన వ్యక్తి. తనని తాను సర్దుబాటు చేసుకోగలడు. ఈ యువ ప్లేయర్లనూ.. రాహుల్ తనలాగే మానసికంగా దృఢంగా తయారు చేశాడు.
దాంతో వాళ్లంతా ఆటలో రాటుదేలారు.

రవిశాస్త్రి పాత్ర మరవలేనిది..
ఇక భారత విజయంలో హెడ్కోచ్ రవిశాస్త్రి సేవల్ని అందరూ మర్చిపోయారు. అతని వల్లే భారత్ సిరీస్ గెలిచింది. ఆటపై అతనికి మంచి పరిజ్ఞానం ఉంది. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను పట్టుకోవడంలో అతను సిద్ధహస్తుడు. అడిలైడ్ ఓటమి తర్వాత నిరుత్సాహ పడకుండా రవి శాస్త్రి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాడు. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తూ ఫలితాన్ని రాబట్టాడు.

విరాట్ దూకుడు..
పెటర్నిటీ లీవ్పై విరాట్ కోహ్లీ జట్టుకు దూరమైనా.. అతను జట్టులో ఉత్సాహాన్ని నింపి పోయాడు. భారత జట్టులో ఎప్పుడూ గొప్ప ఆటగాళ్లు ఉంటారు. వారి బ్యాటింగ్ చాలా దూకుడుగా ఉంటుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ అయినప్పటి నుంచి ఇది మరి ఎక్కువైంది. అతను చాలా అగ్రెసివ్. విరాట్ బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇది గమనించవచ్చు. అతని రాకతోనే జట్టులో ఓ కొత్త ఉత్సాహం వచ్చిందని నేను భావిస్తున్నా. దాంతోనే అతను లేకపోయినా భారత్ విజయాలు అందుకుంది.'అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications