
ఇస్లామాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ధోనీలాంటి దిగ్గజ ఆటగాడు ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటించకూడదని, మైదానంలో అభిమానుల మధ్య ఆటకు గుడ్ బై చెప్పాల్సిందన్నాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్కు కూడా ఈ తరహా సలహానే ఇచ్చానని గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మహీ రిటైర్మెంట్పై స్పందించిన ఈ పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్లు గెలిపించే ఆటగాడు. ప్రతీ మ్యాచ్లో సెంచరీ చేయకున్నా.. విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయంవైపు నడిపిస్తాడు. అలాగే మహీ చాలా తెలివైన కెప్టెన్. గేమ్ను అర్థం చేసుకోవడంలో దిట్ట. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. అతని సారథ్యంలో ఆడిన సురేశ్ రైనా, అశ్విన్ ఇలానే గొప్ప ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. వారి సక్సెస్కు ధోనీనే కారణం.
'ధోనీని మైదానంలో చూడాలని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు కోరుకుంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం ధోనీలాంటి దిగ్గజ ఆటగాడు ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటించకూడదు. మైదానంలో అభిమానుల సమక్షంలో వీడ్కోలు పలకాలి. రిటైర్మెంట్ విషయంలో ఓ సారి సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి సలహానే ఇచ్చా. ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు.. మీరు మీ క్రికెట్ ప్రయాణాన్ని మైదానం నుంచి ముగిస్తే అందరూ సంతోషిస్తారని చెప్పా. ధోనీ గనుక అలా చేసి ఉంటే.. నాతో సహా అతని అభిమానులంతా సంతోషించేవాళ్లు' అని ఇంజమామ్ పేర్కొన్నాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా.. ఐపీఎల్ మాత్రం ఆడనున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ 2020 సీజన్కు సమయాత్తం అవుతున్నాడు.