
స్మృతి స్టన్నింగ్ క్యాచ్
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య శనివారం మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. 59 బంతుల్లో 5 ఫోర్లతో 49 పరుగులు చేసిన నాట్ స్కివర్.. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉంది. అర్ధ సెంచరీ చేయాలనుకున్న స్కివర్.. దీప్తి బౌలింగ్లో లాంగ్ షాట్ కోసం ప్రయత్నించింది. ఆ టైంలో బౌండరీ లైన్ దగ్గర స్మృతి మంధాన పరుగెత్తుకుంటూ వచ్చి.. డైవ్ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకుంది. దీంతో స్కివర్ నిరాశగా పెవిలియన్ చేరింది. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన మంధానపై సహచర ప్లేయర్స్ అభినందనలు కురిపించారు.
India vs England: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా కెప్టెన్! అక్కడ సచిన్.. ఇక్కడ మిథాలీ!!
సూపర్ ఉమెన్
సాధారణంగా మహిళల క్రికెట్లో కళ్లు చెదిరే క్యాచ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన పట్టిన క్యాచ్ చూసిన మాజీ క్రికెటర్లతో పాటు ట్విటర్ యూజర్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఫ్లై స్మృతి ఫ్లై గర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్' అంటూ ఆస్ట్రేలియా మాజీ వుమెన్స్ క్రికెటర్ లీసా స్తాలేకర్ ట్వీట్ చేశారు. 'సూపర్ ఉమెన్' 'రవీంద్ర జడేజాను మించిపోయావ్', 'వావ్ ఫెంటాస్టిక్ క్యాచ్' అంటూ తెగపొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచ్లో మంధాన బ్యాటింగ్లోనూ రాణించింది. 57 బంతుల్లో 49 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

బ్యాటింగ్లోనూ మెరిసిన మంధాన
మూడు వన్డేల సిరీసులో భాగంగా చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మహిళలపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్ స్కివర్ (49; 5 ఫోర్లు), కెప్టెన్ హీతర్ నైట్ (46; 4 ఫోర్లు) రాణించారు.
దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ స్మృతి మంధాన (49; 8 ఫోర్లు) రాణించింది. మిథాలీ రాజ్ అజేయ అర్ధ సెంచరీ 86 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు) సాధించడంతో పాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది. తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఓడటంతో సిరీస్ను 1-2తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.


Click it and Unblock the Notifications












