INDW vs ENGW: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అమ్మాయిల క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న బీసీసీఐ .. ముందు వారి మ్యాచ్ల నిర్వహణపై ఫోకస్ పెట్టాలని మండిపడుతున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులకు మహిళల క్రికెట్ అంటే చాలా చిన్న చూపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్కు కనీస ఏర్పాట్లు చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ మ్యాచ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ బీసీసీఐతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్ను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ఈ మ్యాచ్కు అతి కొద్ది మందే ప్రేక్షకులే హాజరవ్వగా వారికి కూడా సరైన సౌకర్యాలను ఎంసీఏ కల్పించలేకపోయింది. కనీసం అందరికీ కనిపించేలా ఓ స్కోర్ బోర్డును కూడా పెట్టలేదు. అంతేకాకుండా మైదానం మొత్తం ఒకే ఒక్క స్క్రీన్ సౌకర్యాన్ని కల్పించిన నిర్వాహకులు అది కూడా.. అభిమానులు కూర్చున్న వైపే పెట్టారు.
ఈ మ్యాచ్కు హాజరైన ఫ్యాన్స్.. అమ్మాయిల క్రికెట్ అంటే ఇంత నిర్లక్ష్యం, ఇంత చిన్న చూపా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేనియల్ వ్యాట్(47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 75), నాట్ సీవర్(53 బంతుల్లో 13 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు.
భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/27) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్ ఓ వికెట్ పడగొట్టింది.