ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అన్యాయం జరిగింది. రెండు రాష్ట్రాల నుంచి ఒక్క ఆటగాడికి కూడా అవకాశం దక్కలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగిన మహమ్మద్ సిరాజ్పై టీమ్మేనేజ్మెంట్ వేటు వేసింది. అతని స్థానంలో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కింది. గత కొన్నేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకున్న సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ వేటు వేసింది.

జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై క్లారిటీ లేకపోవడంతోనే సిరాజ్కు బదులు అర్ష్దీప్ సింగ్ను ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. సిరాజ్ కొత్త బంతితో మాత్రమే ప్రభావం చూపగలడని, మిడిల్, బ్యాక్ఎండ్లో రాణించలేడని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలతో సిరాజ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండటంతో సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డిని రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు వరుణ్ చక్రవర్తీ, ఆవేశ్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్లుగా జట్టుతో ప్రయాణించనున్నారు. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా నితీష్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నాడు. ఒకవేళ హార్దిక్ గాయపడితే నితీష్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కనుంది.
టీ20 ఫార్మాట్లో రెండు శతకాలతో రాణించిన తిలక్ వర్మను వన్డే ఫార్మాట్కు పరిగణలోకి తీసుకోలేదు. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి అంత్జాతీయ క్రికెట్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, హహర్షిత్ రాణా(రిజర్వ్ ప్లేయర్).