ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించిన టీమిండియాకు మరో 35 రోజుల వరకు ఎలాంటి సిరీస్ లేదు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2025 తోనే టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ను మొదలు పెట్టనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి.
సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో జరిగే మ్యాచ్తో టీమిండియా ఆసియాకప్ క్యాంపైన్ను మొదలు పెట్టనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.సెప్టెంబర్ 28 జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది.
ఈ టోర్నీలో ఆడే భారత జట్టు ఎంపికపై సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. కుర్రాళ్లు, సీనియర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఆగస్ట్ మూడో వారంలో ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ టోర్నీ నుంచి బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ఈ టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా.. వెస్టిండీస్తో సొంతగడ్డపై రెండు టెస్ట్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్కు బుమ్రాను ఫిట్గా ఉంచాలనే ఉద్దేశంతోనే అతన్ని ఆసియాకప్ ఆడించకుండా పక్కనపెట్టనున్నారు. మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి కూడా చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది. గాయాల నుంచి కోలుకున్న షమీ.. మునపటిలా సత్తా చాటలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో హర్షిత్ రాణాను భారత జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత జట్టు ఆసియా కప్ బరిలోకి దిగనుంది. హెర్నియా సర్జరీ నుంచి కోలుకున్న సూర్య.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఒకవేళ అతను పూర్తి ఫిట్నెస్ సాధించకపోతే.. హార్దిక్ పాండ్యా జట్టును నడిపిస్తాడు. ఐపీఎల్లో అద్భుత ప్రద్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. భారత టీ20 టీమ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
కేవలం బ్యాటర్గానే కాకుండా అతని లీడర్షిప్ నైపుణ్యాల నేపథ్యంలో జట్టులోకి తీసుకోనున్నారు. అతనితో పాటు సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, జితేశ్ శర్మ, శుభ్మన్ గిల్ జట్టులో చోటు దక్కించుకోనున్నారు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్లను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్కు నిరాశే ఎదురవ్వనుంది.
ఇంగ్లండ్ పర్యటనలో కుడికాలి చివరి వేలిని విరగ్గొట్టుకున్న పంత్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గాయం నుంచి కోలుకునేందుకు పంత్కు 6 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. గాయం నుంచి కోలుకున్నా.. ఫిట్ సాధిస్తేనే పంత్కు అవకాశం దక్కుతుంది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పంత్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనికి బ్యాకప్గా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కనుంది. పేసర్లుగా ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్కు అవకాశం దక్కనుంది.
ఈ టోర్నీలో పాకిస్థాన్, యూఏఈ, ఓమన్తో భారత్ గ్రూప్-ఏలో ఉంది. పాకిస్థాన్తో మూడు సార్లు భారత్ తలపడే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్లపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్లు జరిగితే మాత్రం ఇరు జట్ల మధ్య యుద్ద వాతావరణం నెలకోనుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా/జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.