న్యూఢిల్లీ: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం విశ్రాంతిలో ఉన్న టీమిండియా.. వచ్చే ఐదు నెలల పాటు బిజీ బిజీగా గడపనుంది. తీరికలేని షెడ్యూల్తో ఆడనుంది. నెల రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. అక్కడ ఆతిథ్య జట్టుతో రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన జూలై 12 నుంచి ఆగస్టు 13వరకు సాగనుంది.
ఆ వెంటనే మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18 నుంచి 23వరకు ఈ పర్యటన సాగనుంది. సెప్టెంబర్లో శ్రీలంక వేదికగా ఆసియాకప్ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రాలేదు. సెప్టెంబర్లోనే జరగనుంది.

అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాటు అఫ్గానిస్థాన్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఈ సిరీస్లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఖారారు కానప్పటికీ సెప్టెంబర్లోనే జరగనున్నాయి. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వెస్టిండీస్తో పాటు ఐర్లాండ్ పర్యటనకు యువ ఆటగాళ్లతో కూడి ద్వితీయ శ్రేణి జట్టును పంపించనున్నారు. వన్డే ప్రపంచకప్ ఆడనున్న ఆటగాళ్లను కేవలం 50 ఓవర్ల ఫార్మాట్కే పరిమితం చేయనున్నారు. ఐర్లాండ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది.
ఆగస్టు 18న తొలి టీ20, ఆగస్టు 20న రెండో టీ20, ఆగస్టు 23న మూడో టీ20 ఆడనుంది. ఈ పర్యటనకు హార్దిక్ పాండ్యాతో పాటు ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లందరూ దూరంగా ఉండనున్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్తో జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అతను బరిలోకి దిగితే భారత జట్టును నడిపించనున్నాడు.