ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడటంపై సందిగ్దత కొనసాగుతోంది. ఇప్పటి వరకు బుమ్రా గాయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో బుమ్రాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కానీ అతను వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువ తీరిన తర్వాత తుది జట్టులో మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్ టీమ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టీమిండియా తమ జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా? లేక ప్రకటించిన జట్టునే కొనసాగిస్తుందా? అనేది చర్చనీయాంశమైంది.

నేడే తుది నిర్ణయం..
జస్ప్రీత్ బుమ్రా స్కానింగ్ రిపోర్ట్లను పరిశీలించి వైద్యులు బీసీసీఐకి మంగళవారం ఓ నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం బీసీసీఐ.. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే విషయంపై తుది నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బుమ్రా అన్ఫిట్గా ఉంటేనే జట్టులో నుంచి తీసేయాలని, అతను ఆడటానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా.. నాకౌట్ మ్యాచ్ల వరకు ఎదురు చూడాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.
బుమ్రాను నేరుగా నాకౌట్ మ్యాచ్ల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది టీమిండియాకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దాదాపు నెల రోజులుగా బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడని, అతన్ని నేరుగా నాకౌట్ మ్యాచ్లు ఆడిస్తే రిథమ్లో బౌలింగ్ చేయడం కష్టమని సూచిస్తున్నారు.
బుమ్రా దూరమైతే..?
ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఆడలేని పరిస్థితి నెలకొంటే అతని స్థానంలో ఎవర్ని తీసుకుంటారు? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బుమ్రాకు బ్యాకప్గా టీమిండియా మేనేజ్మెంట్ హర్షిత్ రాణాతో పాటు వరుణ్ చక్రవర్తీని సిద్దం చేస్తోంది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరికి అవకాశం కల్పించింది. హర్షిత్ రాణా ఆకట్టుకున్నా.. వరుణ్ చక్రవర్తీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. టీ20 ఫార్మాట్ ఫామ్ను కొనసాగించలేకపోయాడు.
ఒకవేళ బుమ్రా దూరమైతే హర్షిత్ రాణానే జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ను కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ హర్షిత్ రాణాను కాదని సిరాజ్ను టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేయకపోవచ్చు. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో హర్షిత్ రాణాతో పాటు వరుణ్ చక్రవర్తీని తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటు పడనుంది.
ఇండియా అప్డేటేడ్ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా/మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా