చివరి నిమిషంలో టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్.. అతి త్వరలోనే సంప్రదాయ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. ఎక్స్ట్రా బౌలర్ ఆప్షన్ కోసం రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ 2024 నుంచి తప్పించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ముందు 20 మ్యాచ్లు ఆడిన రింకూ సింగ్ 15 ఇన్నింగ్స్ల్లో 83.2 సగటుతో 416 పరుగులు చేశాడు. ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయినా.. రిజర్వ్ ప్లేయర్గా టీమిండియాతోనే కొనసాగాడు. బీసీసీఐ ప్రకటించిన క్యాష్ ప్రైజ్ను కూడా అందుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా రింకూ సింగ్ బ్యాటింగ్ను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూ సింగ్కు టెస్ట్ ఫార్మాట్ ఆడగలిగే నైపుణ్యం ఉందని చెప్పాడు. అతి త్వరలోనే అతను టెస్ట్ ఫార్మాట్లోకి అరంగేట్రం చేస్తాడని జోస్యం చెప్పాడు.

'గత రెండు సీజన్లలో అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యాటర్ రింకూ సింగ్. ఇప్పటి వరకు అతను రెండు వన్డేలు, 20 టీ20 మ్యాచ్లే ఆడాడు. అయినా అతన్ని రెగ్యూలర్ ఆటగాడిగా పిలవలేకపోతున్నాం. పొట్టి క్రికెట్లో అతను అద్భుతమైన ఫినిషర్. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 54.70 సగటుతో పరుగులు చేశాడు.
నెట్స్లో రింకూ సింగ్ బ్యాటింగ్ను చూసినప్పుడు అతనిలో ఓ టెస్ట్ క్రికెటర్ ఉన్నాడనిపించింది. టీ20 క్రికెట్లో అతను అద్భుతమైన ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతని ఫస్ట్ క్లాస్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే సగటు 50గా ఉంది. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. టెస్ట్ ఫార్మాట్లో రింకూ సింగ్కు అవకాశం ఇస్తే గొప్ప క్రికెటర్ అవుతాడు.'అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ పదవి కాలం ముగిసింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సపోర్ట్ స్టాఫ్ సైతం టీమిండియాకు వీడ్కోలు పలికారు. కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ను ఎంపిక చేయగా.. సపోర్ట్ స్టాఫ్ వివరాలను ఇంకా ప్రకటించలేదు. గంభీర్కు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎంచుకోవచ్చు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనతో టీమిండియా సపోర్ట్ స్టాఫ్ ఎవరా? అనేది తెలియనుంది.
దేశవాళీ క్రికెట్లో ఉత్తర ప్రదేశ్(యూపీ) తరఫున బరిలోకి దిగే రింకూ సింగ్ 47 మ్యాచ్ల్లో 54.70 సగటుతో 3173 పరుగులు చేశాడు. ఈ ఏడాది భారత్ ఏ తరఫున .. ఇంగ్లండ్ లయన్స్తో ఆడాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఈ ఏడాది సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో టీమిండియా రెండు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో రింకూ సింగ్.. సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.