
హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత్ జట్టు అదరగొట్టింది. ముందుగా బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్పై బౌలింగ్లో సత్తా చాటి ప్రత్యర్థిని సాధారణ స్కోర్కు పరిమితం చేసిన గబ్బర్ సేన.. ఆ తర్వాత టీ20 తరహా హిట్టింగ్తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఆతిథ్య శ్రీలంక జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తయింది. అయితే ఈ మ్యాచ్లో భారత కుర్రాళ్లు పరుగుల విధ్వంసం సృష్టించారు. ఆడుతుంది వన్డే క్రికెటా? లేక టీ20 ఫార్మాటా? అని సందేహపడేలా చెలరేగారు. ఓపెనర్ పృథ్వీ షా ధనాధన్ బ్యాటింగ్కు తెరలేపగా.. ఆ తర్వాత వచ్చిన బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అతన్ని అనుసరించారు.
32 నిమిషాల పాటు క్రీజులో ఉన్న పృథ్వీ షా 24 బంతుల్లో 9 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. స్ట్రైక్రేట్ 179.16. షా ధాటికి భారత్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అందులో ధావన్ చేసిన స్కోరు 7 పరుగులు మాత్రమే అంటే.. షా ఎలా చెలరేగాడో అర్ధం చేసుకోవచ్చు. ఈ పవర్ ఫుల్ హిట్టింగ్తో తొలి 5 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తలకు బంతి బలంగా తగలడంతో ఏకాగ్రత కోల్పోయి అనవసర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.. కానీ అతను క్రీజులో ఉంటే సులువుగా సెంచరే బాదేవాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన ఫస్ట్ బాల్నే సిక్సర్గా మలిచాడు. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్నానే బెరుకు.. వికెట్ పోయిందనే ఒత్తిడి ఇషాన్ కిషన్లో కనిపించలేదు. పైగా తన ఫస్ట్ బాల్ ఎలా వచ్చిన సిక్స్ కొడతానని సహచరులకు ముందే చెప్పానని మ్యాచ్ అనంతరం అతను తెలపడం విశేషం. శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలతో ఇషాన్కు కలిసొచ్చిన మాట వాస్తవమే అయినా.. దూకుడుగా ఆడాలనే తన ఇంటెన్షన్ మాత్రం స్పష్టంగా కనబడింది. ఇషాన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 59 పరుగులు చేయగా.. స్ట్రైక్ రేట్ 140.47. ఆ తర్వాత మనీష్ పాండే తన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినా.. సూర్య కుమార్ యాదవ్ తనదైన శైలిలో ఆడాడు. గ్యాప్ షాట్స్తో బౌండరీలు రాబట్టాడు. అతను కూడా 20 బంతుల్లో 5 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 155. అయితే భారత కుర్రాళ్లు వన్డేల్లో.. ఇలా టీ20 శైలి హిట్టింగ్ చేయడానికి ప్రధాన కారణం టీ20 ప్రపంచకప్ అని విశ్లేషకులు అంటున్నారు.
మెగా టోర్నీకి ముందు ఉన్న ఏకైక పరిమిత ఓవర్ల పర్యటన ఇదే కావడంతో టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చెలరేగుతున్నారని అభిప్రాయపడుతున్నారు. ధనాధన్ బ్యాటింగ్తో సెలెక్టర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీ దృష్టిలో పడాలని భావిస్తున్నారని, ఆ క్రమంలోనే హిట్టింగ్ చేశారని చెబుతున్నారు. స్వేచ్చగా ఆడండని కోచ్ ద్రవిడ్ చెప్పడం కూడా ఓ కారణం కావచ్చంటున్నారు. మ్యాచ్కు వర్ష సూచన ఉందన్న ముందస్తు సమాచారంతో రన్రేట్ మెయింటేన్ చేయాలని ద్రవిడ్ అండ్ కో భావించి ఉండొవచ్చని ఆ క్రమంలోనే కుర్రాళ్లకు ధాటిగా ఆడాలని చెప్పి పంపించి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ద్రవిడ్ యాంకర్ రోల్ పోషించాడంటున్నారు.