భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలవడంతో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ విజయం కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన ఆమె.. చివరకు కప్ సాధించకుండానే ఆట నుంచి నిష్క్రమించింది. కానీ తన శిష్యురాళ్లు తన కలను సాకారం చేసిన వేళ మిథాలీ రాజ్ ఉబికి వచ్చిన దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది.
ఈ విజయానంతరం టైటిల్ అందుకున్న భారత మహిళల జట్టు.. నేరుగా మిథాలీ రాజ్తో పాటు మాజీ మహిళా దిగ్గజాలు అయిన జులాన్ గోస్వామి, అంజుమ్ చోప్రా చేతిలో పెట్టింది. ఈ విజయానికి మీరే కారణమని, మీరు అందించిన స్ఫూర్తితోనే ఈ విజయాన్ని అందుకున్నామని చెప్పింది. కప్ స్వీకరించి తమ సంబరాల్లో భాగం కావాలని కోరింది.
టైటిల్ అందుకున్న ఈ ముగ్గురు దిగ్గజాలు కన్నీటిపర్యంతమవుతూనే టైటిల్ను పైకెత్తి సంబరాలు చేసుకున్నారు. ఏడుస్తూనే ఈ టైటిల్ కోసం ఎన్నో ఏళ్ల నిరీక్షించామని, ఇన్నాళ్లకు ఇది మనకు దక్కిందని మిథాలీ రాజ్ ఆవేదన వ్యక్తం చేసింది. మిథాలీ రాజ్ సారథ్యంలో భారత్ రెండు సార్లు ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 2005 మహిళల వన్డే ప్రపంచకప్, 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలైంది.

ఆ తర్వాత కొన్నాళ్లు భారత జట్టులో కొనసాగిన మిథాలీ రాజ్.. చివరకు టైటిల్ లేకుండానే నిష్క్రమించింది. వాస్తవానికి మిథాలీ రాజ్ భారత్కు ప్రాతినిథ్యం వహించే సమయంలో ఇన్ని సౌకర్యాలు కూడా లేవు. బీసీసీఐలో భాగం కూడా కాదు. ఎన్నో వివక్షలు, ఎగతాళిలను ఎదుర్కొని భారత మహిళల జట్టును నిలబెట్టింది. 2017 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత పురుషుల తరహాలో మహిళలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టింది. కానీ ఆమె రిటైర్మెంట్ తర్వాతే డబ్ల్యూపీఎల్ పురుడు పోసుకుంది.
రెండు సీజన్లు దిగ్విజయంగా ముగిసింది. ఈ టోర్నీ ఫలితం మహిళల ప్రపంచకప్ ఫైనల్లో కనిపించింది. భారత మహిళలు ఒత్తిడిని చిరునవ్వుతో జయించి తొలిసారి తుదిపోరు చేరిన సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు. ఈ విజయం హర్మన్ సేన గెలిచినా.. వారికి స్ఫూర్తి మాత్రం మిథాలీ రాజ్, జులాన్ గోస్వామి, అంజుమ్ చోప్రా వంటి దిగ్గజ మహిళా క్రికెటర్లే. మాజీ క్రికెటర్లకు ట్రోఫీ అందజేసిన సన్నివేశాలు అభిమానులను కూడా భావోద్వేగానికి గురి చేసింది.
MITHALI RAJ LIFTING THE WORLD CUP TROPHY. 🥹
— Johns. (@CricCrazyJohns) November 3, 2025
- She played a major role in Women's Cricket in India. pic.twitter.com/QnrA4pMBpk