
ముంబై: దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత మహిళల క్రికెట్ జట్టు 2021లో మరో టెస్టు ఆడటం ఖాయమైంది. 2014లో చివరిసారిగా టెస్టు ఆడిన మిథాలీ రాజ్ నేృత్వంలోని భారత జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్తో బ్రిస్టల్లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీనికి తోడు ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియా పర్యటించనున్న టీమ్ అక్కడ కూడా ఏకైక టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఒకే ఏడాది రెండు అగ్రశ్రేణి జట్లతో భారత మహిళలు టెస్టులు ఆడనుండటం విశేషం.
ఇరు బోర్డులు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా... ఆసీస్ పేస్ బౌలర్ మేగన్ షూట్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు బీసీసీఐ కూడా హింట్ ఇచ్చింది. 'ఇంగ్లండ్, ఆసీస్ మహిళల టీమ్స్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. అందుకే మనం కూడా అదే దారిలో వెళ్లాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఆసీస్తోనూ ఓ మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నాం'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. పురుషుల పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా వచ్చిన ఈ ఆలోచనను.. గత నెలలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చర్చించారు.
1977, 1984, 1990-91, 2006లలో కలిపి భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మొత్తం 9 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆసీస్ 4 గెలవగా, మరో 5 'డ్రా'గా ముగిశాయి. భారత్ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. 2006లో అడిలైడ్లో జరిగిన మ్యాచ్ తర్వాత ఇరు జట్ల తలపడనుండటం ఇదే మొదటిసారి.
మరోవైపు ఇంగ్లండ్ టూర్కు రెడీ అవుతున్న తమకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్న బీసీసీఐకి టెస్ట్, వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, టీ20 సారథి హర్మన్ ప్రీత్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు. ముంబై చేరుకోవడానికి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్.. ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి వద్దనే రెగ్యులర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహించేలా ప్లాన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు.
'కరోనా టైమ్లో ట్రావెలింగ్ ఓ చాలెంజ్గా మారింది. కానీ మా కోసం బీసీసీఐ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. రెగ్యులర్గా ఇంటి వద్దనే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. ముంబై, యూకేకు వెళ్లడానికి చార్టెడ్ ఫ్లైట్స్ను వేస్తున్నారు. ఇదంతా చేస్తున్న బోర్డుకు చాలా కృతజ్ఞతలు'అని మిథాలీ ట్వీట్ చేసింది. డిస్టెన్స్, కన్వినియన్స్ దృష్ట్యా కొందరు ప్లేయర్లు సొంతంగా ముంబైకి ట్రావెల్ చేయనున్నారు. బోర్డు ఈ అవకాశం ఇచ్చినందుకు హర్మన్ప్రీత్ సంతోషం వ్యక్తం చేసింది.