టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా.. తొలి మ్యాచ్ను అప్గానిస్థాన్తో ఆడనుంది. జూన్ 20న బార్బోడస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాను ఓడించిన టీమిండియా గ్రూప్-ఏ టాపర్గా సూపర్-8లోకి అడుగుపెట్టింది.

అస్థిర బౌన్స్, పేస్తో పాటు అనూహ్య స్పిన్తో ఈ వికెట్పై బ్యాటింగ్ చేసేందుకు తెగ కష్టపడింది. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో విజయాలు సాధించింది. సూపర్ 8 మ్యాచ్లు వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. అక్కడి పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. మరో మూడు రోజుల్లో బంగ్లాదేశ్తో టీమిండియా తొలి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ వేదిక అయిన బార్బోడస్కు ఆదివారమే చేరుకున్న టీమిండియా.. ప్రాక్టీస్ చేయకుండా అక్కడి బీచ్ల్లో సేదతీరుతుంది. ప్రత్యర్థి అఫ్గానిస్థాన్ అన్న అలసత్వమో.. లేక వెస్టిండీస్ పిచ్లపై అవగాహన ఉందనే ధీమానో తెలియదు కానీ.. ప్రాక్టీస్ మానేసి బీచ్లో వాలీబాల్ ఆడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
జట్టులోని ఆటగాళ్లు ఇరు జట్లుగా విడిపోయి బీచ్ వాలీబాల్ ఆడారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ తమ సిక్స్ ప్యాక్ బాడీలను ప్రదర్శించగా.. శివమ్ దూబే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్ టీషర్ట్స్తో ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు ఈ బీచ్ వాలీబాల్ గేమ్కు దూరంగా ఉన్నారు.
ప్రాక్టీస్ మానేసి బీచ్ వాలీబాల్ ఆడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం టీమిండియా ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. రిఫ్రెష్మెంట్ కోసం ఆటగాళ్లు సరదాగా గడపడం ముఖ్యమని, ఇదంతా ట్రైనింగ్లో భాగమేనని గుర్తు చేస్తున్నారు.