
షెడ్యూల్లో మార్పులు..
బీసీసీఐ ప్రతిపాదనకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కూడా ఓకే చెప్పింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న మొదలయ్యే సిరీస్లో భారత్, సౌతాఫ్రికా మధ్య వరుసగా మూడు టెస్ట్లు, మూడు వన్డే మ్యాచ్లు జరుగుతాయి. ఇక నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2022లో ఏదో ఒక టైమ్లో రీషెడ్యూల్ చేస్తారు. సౌతాఫ్రికాతో ఆడే మూడు టెస్ట్లు, మూడు వన్డేల కోసం బీసీసీఐ 20 మంది ప్లేయర్లను పంపాలని భావిస్తోంది.
ఇందులో కొందరు భారత్-ఏ టీమ్ కోసం ఆడుతూ ప్రస్తుతం సఫారీ గడ్డపైనే ఉన్నారు. భారత్-ఏలో ఉన్న కొందరు యువ ఆటగాళ్లను నెట్ బౌలర్లుగా సీనియర్ జట్టుతోనే ఉంచనున్నారు. ప్రస్తుతం ముంబై టెస్ట్ను గమనిస్తున్న సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ వారంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే జట్టును ప్రకటించనున్నారు.

కోహ్లీ వన్డే కెప్టెన్సీ ఊడేనా?
ఇప్పటికే టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదిలిన విరాట్ కోహ్లీని వన్డే సారథిగా కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశమైంది. టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మకే వన్డే కెప్టెన్సీ కూడా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్లో ఆడనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది.
అయితే బీసీసీఐ అధికారులు మాత్రం.. వన్డే కెప్టెన్సీ మార్పుకు మరింత సమయం పట్టవచ్చంటున్నారు. ఈ ఏడాది భారత్కు పెద్దగా వన్డే సిరీస్ల్లేవ్ కాబట్టి.. ఇప్పట్లో ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చని ఓ అధికారి తెలిపారు. ఇక టెస్ట్ల్లో పేలవ ఆటతీరుతో జట్టులో చోటు కోల్పోయిన రహానే వైస్ కెప్టెన్సీ కూడా కోల్పోనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టులో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తదుపరి వైస్ కెప్టెన్గా రోహిత్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రహానే, పుజారాకు చోటు దక్కినా..?
ఇక సీనియర్ ఆటగాళ్లనే ట్యాగ్తో అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా సఫారీ పర్యటనకు ఎంపికైనా తుది జట్టులో ఆడటం కష్టమే. ముఖ్యంగా రహానేకు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. ఇక రహానేలానే దారుణంగా విఫలమవుతున్న పుజారాకు ప్రత్యామ్నాయంగా అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచల్ను ఎంపిక చేసే చాన్సుంది.
ప్రస్తుతం భారత్-ఏ జట్టుతో సఫారీ పర్యటనలో ఉన్న ఈ ఇద్దరు అక్కడ రాణిస్తున్నారు. ముంబై టెస్ట్లో అయిన గాయం పెద్దది కాకపోతే.. మయాంక్ అగర్వాల్ను కూడా పుజారాకు ప్రత్యామ్నాయంగా నెంబర్ 3లో ఆడించే అవకాశం ఉంది. ఇక రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఆడటం ఖాయం. ఇంగ్లండ్ పర్యటనలో ఈ ఇద్దరు దుమ్ములేపారు. బ్యాకప్ ఓపెనర్గా పృథ్వీషాను ఎంపిక చేయనున్నారు. గిల్.. చేతి వేలి గాయంతో ఈ పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఇషాంత్ శర్మ ఔట్..
సీనియర్ టెస్ట్ పేసర్ ఇషాంత్ శర్మ ఈ పర్యటనకు ఎంపిక అవ్వడంపై అనుమానాలు నెలకొన్నాయి. అతని భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. రిటైర్మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపుతుండగా.. మరోవైపు సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ సుదీర్ఘ విశ్రాంతి అనంతరం జట్టులోకి రానున్నారు.
బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ కూడా కమ్ బ్యాక్ చేయనున్నాడు. ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఉమేశ్ యాదవ్కు కూడా నిరాశ తప్పేలా లేదు. ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆడటం ఖాయం. వన్డేల్లో యుజ్వేంద్ర చాహల్ను పరిగణలోకి తీసుకోవచ్చు.

సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా, హనుమ విహారి, రవింద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ


Click it and Unblock the Notifications
