
న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు శుభావార్త. కరోనా వైరస్ బారిన పడిన టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న 8 మంది ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక స్పోర్ట్స్ జర్నలిస్ట్ల వివరాల ప్రకారం భారత జట్టులో కృనాల్ మినహా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ నెగటీవ్ వచ్చినట్లు సమాచారం. దాంతో వాయిదా పడిన రెండో టీ20 బుధవారం జరగనుంది. హార్దిక్ పాండ్యాతో సహా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న ఈ 8 మందిని మ్యాచ్ ఆడేందుకు అనుమతిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
ఒకవేళ అనుమతిస్తే మాత్రం కృనాల్ పాండ్యా ప్లేస్లో కృష్ణప్ప గౌతమ్కు అవకాశం దక్కనుంది. అనుమతించకపోతే మాత్రం ఇతర ఆటగాళ్లతో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత్ ఐదుగురు రిజర్వ్ ప్లేయర్లతో సహా మొత్తం 25 మంది సభ్యుల జంబో జట్టుతో భారత్లో అడుగుపెట్టింది. అయితే కృనాల్ సన్నిహితంగా ఉన్న వాడిలో ఒకరు హార్దిక్ పాండ్యా అని తెలిసినా మిగతా ఏడుగురు ఎవరా? అనే విషయం తెలియరాలేదు. ఇందులో కీలక ప్లేయర్లు ఉంటే పరిస్థితి ఏందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఏదీ ఏమైనా రేపు ఉదయం ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ రానుంది.
ఇప్పటికే తొలి టీ20లో 38 పరుగులతో గెలుపొంది మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. రెండో మ్యాచు కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. నేడు (మంగళవారం) జరిగే పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచు మొదలవుతుందనగా.. కృనాల్కు వైరస్ సోకిన విషయం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. 'అవును, కృనాల్కు పాజిటివ్ వచ్చింది. నేటి టీ20 మ్యాచ్ వాయిదా పడింది. భారత బృందంలోని మిగతా ఆటగాళ్ల ఆర్టీ పీసీఆర్ ఫలితాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలకు అవి అందుతాయి. ఇంకెవరికీ వైరస్ సోకని పక్షంలో బుధవారం మ్యాచ్ ఉండొచ్చు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
కృనాల్కు పాజిటివ్ రావడం ఇంగ్లండ్కు వెళ్లాల్సిన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా పైనా ప్రభావం పడనుంది. బబుల్ నుంచి బబుల్కు బదిలీ జరిగితే క్వారంటైన్ అవసరం లేదు. నేరుగా కోహ్లీసేనతో కలవచ్చు. మరిప్పుడు బుడగలోనే వైరస్ రావడంతో సూర్య, షా పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు.