టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హర్షిత్ రాణా బౌలింగ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. అలెక్స్ క్యారీ ఎక్స్ట్రా కవర్ దిశగా ఆడగా.. బ్యాక్వార్డ్ పాయింట్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ పరుగెత్తుకొచ్చి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన అయ్యర్.. ఎడమవైపు పడిపోయాడు. దాంతో అతని ఎడమ పక్కటెముకల్లో అంతర్గత గాయమైంది.
వెంటనే మైదానం బయటకు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్ను ప్రాథమిక పరీక్షల కోసం సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. టెస్ట్ల అనంతరం శ్రేయస్ అయ్యర్ హోటల్ గదికి తిరిగి రాగా.. నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా శ్రేయస్ అయ్యర్ పక్కటెముకల్లో నొప్పి పెరగడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా.. అంతర్గత రక్తస్రావం అవుతున్నట్లు రిపోర్ట్లో తేలిందని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. దాంతో శ్రేయస్ అయ్యర్ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్ 5 నుంచి 7 రోజులు సిడ్నీ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. దాంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు శ్రేయస్ అయ్యర్ దూరంగా కానున్నాడు.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే శ్రేయస్ అయ్యర్ను దురదృష్టం వెంటాడుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియా వన్డే వైస్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న శ్రేయస్ అయ్యర్.. అంతలోనే తీవ్ర గాయంతో జట్టుకు దూరమయ్యాడు. గతంలో అతను వెన్ను నొప్పితో బాధపడ్డాడు. సర్జరీ కూడా చేసుకున్నాడు. ఇటీవలే వెన్ను నొప్పి తిరగబెడుతుందని సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేనని బీసీసీఐకి లేఖ రాసాడు. అంతలోనే పక్కటెముకల గాయానికి గురయ్యాడు.
ఇక మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ ఈ వన్డే సిరీస్ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. బుధవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.