హైదరాబాద్: 'పాకిస్థాన్ను చూసి భారత్ భయపడుతోంది' (IndiaAfraidOfPakistan)అనే ట్యాగ్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఆసియాకప్ 2023లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్ అభిమానులు భారత్ భయపడుతోంది అంటూ వెకిలి కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్థాన్ పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, హ్యారీస్ రౌఫ్, నసీమ్ షాల బౌలింగ్కు భారత బ్యాటర్లు వణికిపోతున్నారని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్లో పాక్ పేస్ త్రయం ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలిందని, అది ట్రైలర్ మాత్రమేనని.. ఆదివారం చుక్కలేనని హెచ్చరిస్తున్నారు.

ఈ ట్రోలింగ్ను భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. ఈ అనవసర ట్రోలింగ్ ఆపి ఆదివారం జరిగే పోరుకు సిద్దం కావాలని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని హితవు పలుకుతున్నారు. గత రికార్డులు చూసి ఈ మాటలు మాట్లాడాలని చురకలంటిస్తున్నారు. సూపర్-4 మ్యాచ్లో ప్రతీ బౌలర్ సరదా తీరుస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
పల్లెకెలె వేదికగా జరిగిన తొలి దాయాదుల సమరం వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ మాత్రమే చేయగా.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. పాక్ పేస్ త్రయం ధాటికి భారత టాప్-4 బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా సత్తా చాటి జట్టుకు భారీ స్కోర్ అందించారు.

ఈ క్రమంలోనే సూపర్ 4 మ్యాచ్కు అత్యంత ప్రాధాన్యత నెలకొంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు సోషల్ మీడియా వేదికగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా.. మరోవైపు ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆ రోజంతా 75 శాతం వాన పడే అవకాశం ఉంది. మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు.
అయితే ఈ మ్యాచ్కు రిజర్వే డే కేటాయించినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిందని పాకిస్థాన్కు చెందిన సామా టీవీ పేర్కొంది. ఒకవేళ రిజర్వ్ డే ఉంటే మ్యాచ్ ఆగిపోయిన దగ్గర్నుంచి మరుసటి రోజు కొనసాగించనున్నారు. ఆ రోజు కూడా వర్షంతో మ్యాచ్ సాధ్యం కాకపోతే మాత్రం రద్దు చేస్తారు.