ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాకిస్థాన్ తెరలేపిన బాయ్కట్ నాటకానికి తెరపడింది. భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఐసీసీతో చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు మిత్ర దేశాల విజ్ఞప్తి చేయడంతో భారత్తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దాంతో ఆదివారం కొలంబో వేదికగా జరిగే భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్కు మార్గం సుగుమమైంది.
వాస్తవానికి పాకిస్థాన్ బాయ్కట్ చేస్తామని ప్రకటించినప్పుడే ఆ జట్టు యూటర్న్ తీసుకుంటుందని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు భావించారు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారం భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందని చెప్పాడు. పాకిస్థాన్ తమ నిర్ణయంపై యూటర్న్ తీసుకుంటుందని తొలి రోజే జోస్యం చెప్పాడు.

భారత అభిమానులు కూడా మ్యాచ్ను బహిష్కరించే దమ్ము పాకిస్థాన్కు లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. తాజాగా పాకిస్థాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. ఐసీసీ ఆంక్షలకు పాకిస్థాన్ భయపడిందని కామెంట్ చేస్తున్నారు. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ఆడించిన డ్రామా ఇదని, భారత్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా చేసిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కానీ పాక్ బెదిరింపులకు భారత్ జనకకపోవడంతో చేసేదేమి లేక తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు.భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్దరణ, భారత్, బంగ్లాదేశ్, పాక్ మధ్య ముక్కోణపు సిరీస్, బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లేలా బీసీసీఐని ఒప్పించాలని ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసింది. కానీ ఈ డిమాండ్లను ఐసీసీ తోసిపుచ్చింది.పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలని బీసీసీఐని ఆదేశించే అధికారం తమకు లేదని, ఈ అంశం తమ పరిధిలో లేదని పీసీబీకి ఐసీసీ తేల్చి చెప్పింది. బీసీసీఐకి మాత్రమే ఈ అధికారం ఉందని, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బీసీసీఐ నడుచుకుంటుందని పీసీబీకి ఐసీసీ స్పష్టం చేసింది.
చివరకు చేసేదేమి లేక మ్యాచ్ ఆడేందుకు పీసీబీ అంగీకరించింది. ఈ మ్యాచ్ ఆడకపోయి ఉంటే పీసీబీపై ఐసీసీ తాత్కలిక నిషేధం విధించేది. బ్రాడ్కాస్టర్లకు వాటిల్లే రూ.348 కోట్ల నష్టాన్ని పీసీబీ నుంచే రికవరీ చేసేది. అంతేకాకుండా పీఎస్ఎల్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు జారీ చేయకుండా ఆయా దేశాల క్రికెట్ బోర్డులను ఆదేశించేది. వీటికే భయపడి పాకిస్థాన్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.