కొంపలు మునిగినట్లే..
భారత మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం కారణంగా మంచి జోష్లో ఉన్న రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. మరో 25 పరుగులు చేస్తే జడేజా కెరీర్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకునేవాడు. కానీ కొంపలు మునిగినట్లే టీమిండియా మేనేజ్మెంట్ డిక్లేర్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్నే అభిమానులు తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీని కూడా ద్రవిడ్ ఇలానే అడ్డుకున్నాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అప్పుడు సచిన్.. ఇప్పుడు జడేజా..
గతంలో సచిన్ టెండూల్కర్(194 నాటౌట్) కూడా డబుల్ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఉండగా కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ డిక్లేర్ ఇచ్చాడు. అప్పట్లో ఇది భారత క్రికెట్లో పెద్ద దుమారాన్ని రేపింది. 2004 పాకిస్థాన్ పర్యటనలో ఈ ఘటన జరిగింది. ఆ మ్యాచ్ సెహ్వాగ్(309)ట్రిపుల్ సెంచరీ బాదగా.. సచిన్ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే ఈ నిర్ణయాన్ని మాస్టర్ అవమానకరంగా భావించాడని అప్పటి కోచ్ జాన్రైట్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. జట్టు రెండు వర్గాలుగా విడిపోతుందో ఏమోనని భయపడ్డామని చెప్పాడు. తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లోనూ దీనిపై మాస్టర్ ప్రస్తావించాడు. ఆ సమయంలో బాధ కలిగినా జట్టు విజయం కోసం ద్రవిడ్ ఆ నిర్ణయం తీసుకున్నాడని రాసుకొచ్చాడు.
ద్రవిడ్కు డబుల్ సెంచరీలు ఇష్టం లేదు..
తాజా మ్యాచ్లోనూ మంచి జోరు మీదున్న జడేజా.. సులువుగా డబుల్ సెంచరీ చేసేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ద్రవిడ్కు డబుల్ సెంచరీలు అంటే ఇష్టం లేదేమోనని ట్వీట్ చేస్తున్నారు. ఇదో అత్యంత చెత్త నిర్ణయమని ఇంకొందరూ అంటున్నారు. అయితే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని, రాహుల్ ద్రవిడ్ను ఎందుకు బద్నాం చేస్తున్నారని ఇంకొందరు అంటున్నారు. ఇక జడేజాకు వేగంగా ఆడాలని కుల్దీప్ యాదవ్లో అనేక సార్లు చెప్పారని, అయినా అతను వినకపోవడంతో డిక్లేర్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా.. ఈ డిక్లేర్ నిర్ణయం మరో వివాదానికి తెరలేపింది.
పట్టు బిగించిన భారత్..
రవీంద్ర జడేజా(228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లతో 175 నాటౌట్) అజేయ శతకానికి రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీ తోడవడంతో ఈ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. ఇంకా మూడున్నర రోజుల ఆట మిగిలుండటంతో టీమిండియా ఘన విజయం సాధించే అవకాశం ఉంది. జడేజా, అశ్విన్ ఏడో వికెట్కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఇక తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో మెరిసాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిలకడగా ఆడుతోంది.


Click it and Unblock the Notifications
