
దుబాయ్: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్కు పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులు ఐసీయూలోనే ఉన్నాడు. ఇక కీలక సెమీస్ మ్యాచ్కు ముందు రోజు అతడు కోలుకున్నాడు. రిజ్వాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్కు దూరంగా ఉండమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సహా సహచర ఆటగాళ్లు సూచించారు. అయినప్పటికీ తాను కీలక సెమీస్ మ్యాచ్లో ఆడతనని రిజ్వాన్ పట్టుబట్టి మరి బరిలోకి దిగాడు. సెమీస్లో కూడా తన ఫామ్ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీతో అలరించి పాక్ మంచి స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆ ఆస్పత్రిలో రిజ్వాన్కు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఓ భారతీయుడు. ఆయన పేరు సహీర్ సైనలబ్దీన్. దీంతో ఆసీస్తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ డాక్టర్ను కలిసిన రిజ్వాన్.. అతడికి తన జెర్సీని బహుమతిగా అందించాడు. మ్యాచ్ సమయానికి అతడిని ఫిట్గా తయారు చేసినందుకు ఆ వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు రిజ్వాన్. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఆ డాక్టర్.
ఆసీస్తో మ్యాచ్కు ముందు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరారు పాక్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, రిజ్వాన్. మాలిక్ సమస్య చిన్నదే అయినా.. రిజ్వాన్ సమస్యను తీవ్రంగా పరిగణించిన వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతరం కోలుకుని మ్యాచ్లో బరిలో దిగిన రిజ్వాన్ ఓపెనర్గా వచ్చి 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ పోస్ట్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. 'ఈ వ్యక్తి ఈరోజు తన దేశం కోసం మ్యాచ్ ఆడాడు అంటే నమ్మగలరా?. మ్యాచుకు రెండ్రోజుల ముందు మొహ్మద్ రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడు. అతని డెడికేషన్ సూపర్. అతడు హీరో' అని అక్తర్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు పాక్ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.