
హైదరాబాద్: భారత క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పోస్ట్లో ఉన్న భారత ఆటగాళ్లు ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందంటే..? భారత ఆటగాళ్లు క్రికెటర్లు కాకపోయుంటే ఎలా ఉండేవారనేది సరదాగా ఓ అభిమాని ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవలికలను మార్చాడు.
ఈ ఫొటోల్లో ఫిట్గా ఉండే టీమిండియా ఫాట్ ఇండియాగా తయారైంది. మాములుగా 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్ట వేసుకొని, ఎలా లావుగా, అన్ఫిట్గా ఉంటారో.. ఈ ఫొటోలో క్రికెటర్లు కూడా అలానే ఉన్నారు. లావు చెంపలతో బొద్దుగా అంకుల్స్ను తలపిస్తున్నారు. దాంతో అభిమానులు ఆ ఫొటోలను చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ తరహా ఫొటో ఎడిటింగ్లపై విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు తెల్లగా ఉన్నవారిని, నల్లగా... నల్లగా ఉన్నవారిని తెల్లగా మారుస్తున్నారు. దాంతో ఇది కూడా ఓ రకమైన జాతి వివక్షేననే విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే ఓ విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్కు సమాయత్తం అవుతుంది. ఇక ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన సెండ్ టెస్ట్లో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. ఐదు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది. మూడో టెస్ట్ కోసం లీడ్స్ చేరుకున్న కోహ్లీసేన.. హెడింగ్లే స్టేడియంలో ఆదివారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పంత్తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్లో శ్రమించారు.
ఇక ఫిట్నెస్ విషయంలో టీమిండియాలో కోహ్లీ చాలా మార్పులు తీసుకువచ్చాడు. ఫిట్ ఫ్రీక్గా మారి టీమ్ను సైతం ఫిట్ ఇండియాగా మార్చాడు. ఆటగాళ్లు జట్టులోకి రావాలంటే పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాలని, జట్టు ప్రమాణికాలు అందుకోవాలనే ఇప్పటికే కోహ్లీ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ పర్యటన ముందు కూడా ఇదే విషయాన్ని నొక్కిచోప్పాడు.