భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వైఫల్యం కొనసాగుతోంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు దారుణంగా విఫలమయ్యారు. మరోసారి టైటిల్ లేకుండానే ముగించారు. ప్రిక్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 2ను ఓడించి ఆశలు రేకెత్తించిన లక్ష్యసేన్.. క్వార్టర్స్లోనే ఇంటి ముఖం పట్టాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 15 ర్యాంకర్ అయిన లక్ష్యసేన్ 10-21, 16-21 తేడాతో వరల్డ్ నెంబర్ 6.. లి షి ఫెంగ్(చైనా) చేతిలో ఓడిపోయాడు.
ఫెంగ్పై గెలుపోటముల్లో 7-3తో మెరుగైన రికార్డ్ కలిగిన లక్ష్య సేన్ ఈ సారి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం 17 నిమిషాల్లో తొలి గేమ్ విజయం సాధించిన ఫెంగ్.. రెండో గేమ్లోనూ జోరు కొనసాగించాడు. లక్ష్క్ష్య పుంజుకున్నప్పటికీ చైనా ప్లేయర్ ఏ అవకాశం ఇవ్వలేదు. 37 షాట్ల సుదీర్ఘ ర్యాలీని గెలిచి లక్ష్య ఒక దశలో 10-8తో లీడింగ్లో నిలిచాడు. అయితే 14-14తో లక్ష్యసేన్ను సమం చేసిన చైనా ప్లేయర్ అదే జోరు కొనసాగించి మ్యాచ్ను త్వరగా ముగించాడు.

గతేడాది మహిళల డబుల్స్లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ జోడీ.. ఈ సారి క్వార్టర్స్లోనే వెనుదిరిగింది. గాయత్రి, ట్రీసా జోడీ 14-21, 10-21 తేడాతో రెండో సీడ్ షెంగ్సూ, టాన్ నింగ్(చైనా) చేతిలో ఓటమిపాలైంది. చైనా షట్లర్ల జోరు ముందు భారత జోడీ తేలిపోయింది. వరుస గేమ్ల్లో గెలిచిన చైనా జోడీ సెమీస్కు దూసుకెళ్లింది.
ఈ టోర్నీలో వెటరన్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 16వ ర్యాంకర్ అయిన సింధు 21-19, 13-21, 13-21తో కిమ్ గ వున్ (కొరియా) చేతిలో ఓటమిపాలైంది.