భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు రంగం సిద్దమైంది. మరో 48 గంటల్లో ఈ సిరీస్కు తెరలేవనుంది. గురువారం నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే తమ సన్నాహకాలను పూర్తి చేసుకున్నాయి. మైదానంలో బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాను ఓ బలహీనత వెంటాడుతోంది.
ఈ సమస్యను అధిగమించకపోతే.. దాయాదీ పాకిస్థాన్కు పట్టిన గతే టీమిండియాకు పడుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టీమిండియాను అంతగా కలవరపెడుతున్న సమస్య ఏంటంటే స్పిన్ బౌలింగ్. ఒకప్పుడు స్పిన్ బౌలింగే భారత జట్టుకు ప్రధాన ఆయుదం. ముఖ్యంగా టెస్ట్ల్లో స్పిన్ బౌలింగ్ అంటే భారత బ్యాటర్లు, బౌలర్లు పండుగ చేసుకునేవారు.

వెంటాడుతున్న స్పిన్..
ముందుగా బంతితో సత్తా చాటి.. ఆ తర్వాత బ్యాట్తో మెరిసి విజయాలను నమోదు చేసేది. ద్రవిడ్, సచిన్, సెహ్వాగ్, ధోనీ, లక్ష్మణ్ స్పిన్ బౌలింగ్ను అలవోకగా ఆడేవారు. కానీ ప్రస్తుత భారత ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. స్పిన్నర్లను ఎదుర్కోలేక పెవిలియన్కు క్యూ కడుతున్నారు. కోహ్లీ, రోహిత్ వంటి ప్రధాన ఆటగాళ్లు కూడా స్పిన్ బౌలింగ్కు ఇబ్బంది పడుతున్నారు.
గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నా... స్పిన్ ఆడటంలో మాత్రం భారత బ్యాటర్ల తడబాటు కొనసాగుతూనే ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఓపికతో పాటు ప్రత్యేకమైన నైపుణ్యం, బంతిని వేగంగా అంచనా వేసే ప్రతిభ ఉండాలి. కానీ భారత బ్యాటర్లలో ఈ నైపుణ్యాలు తగ్గినట్లు కనిపిస్తోంది.
స్పిన్ బౌలింగ్లోనే ఔట్..
సొంతగడ్డపై వరుసగా సిరీస్లు గెలుస్తున్నప్పటికీ స్పిన్నర్లపై మాత్రం పై చేయి సాధించడం లేదు. ఈ ఏడాది ఇంగ్లండ్ జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో ఆ జట్టు స్పిన్నర్లు హార్ట్లీ 22, షోయబ్ బషీర్ 17, రెహాన్ అహ్మద్ 11, జో రూట్ 8 వికెట్లు తీసారు. టీమిండియా బ్యాటర్లలో రోహిత్, కోహ్లీ గత 35 ఇన్నింగ్స్ల్లో 22 సార్లు స్పిన్నర్లకే ఔటయ్యారు.
శుభ్మన్ గిల్ 30 ఇన్నింగ్స్ల్లో 17 సార్లు, అక్షర్ పటేల్ 22 ఇన్నింగ్స్ల్లో 14 సార్లు, అశ్విన్ 35 ఇన్నింగ్స్ల్లో 22 సార్లు, జడేజా 32 ఇన్నింగ్స్ల్లో 16, రిషభ్ పంత్ 24 ఇన్నింగ్స్ల్లో 12 సార్లు స్పిన్నర్లకే వికెట్ ఇచ్చుకున్నారు. ఒక్క యశస్వి జైస్వాల్ మాత్రమే 11 ఇన్నింగ్స్ల్లో 6 సార్లు స్పిన్నర్లకు ఔటైనా.. 112.17 సగటుతో 673 పరుగులు చేశారు.
తిరిగే బంతిని తిప్పికొట్టాల్సిందే..
ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్లు భారత బ్యాటర్లు తేలిపోతున్నారు. గత మూడేళ్లలో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ 10 సార్లు, కోహ్లీ 9 సార్లు, రోహిత్ 8 సార్లు ఔటయ్యారు. ఈ క్రమంలోనే భారత బ్యాటర్లు స్పిన్ను సమర్థవంతంగా ఆడటంపై ఫోకస్ పెట్టాలని క్రికెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. తిరిగే బంతిని తిప్పికొడితేనే టీమిండియాకు విజయాలు దక్కుతాయని లేకుంటే ఘోర పరాజయం ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.