టీ20 ప్రపంచకప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్, సిక్సర్ల సింగ్ యువరాజ్ సింగ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నియమించింది. ఇప్పటికే జమైకన్ పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ను ప్రచారకర్తలుగా నియమించిన ఐసీసీ.. మూడో బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్ సింగ్ను ఎంపిక చేసింది.
అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించాలనే సంకల్పంతో ఐసీసీ.. అగ్రరాజ్యం వేదికగా ప్రపంచకప్ నిర్వహిస్తోంది. న్యూయార్క్తో పాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి.

ఈ క్రమంలోనే స్టార్ స్ప్రింటర్ అయిన ఉసేన్ బోల్ట్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. అతనికి అమెరికా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ను రెండో అంబాసిడర్గా ఎంపిక చేసిన ఐసీసీ.. క్రికెట్ను ఎక్కువగా అభిమానించే యువరాజ్ సింగ్ను మూడో ప్రచారకర్తగా తీసుకుంది.
అరంగేట్ర 2007 టీ20 ప్రపంచకప్లో యువ రాజ్ సింగ్ సంచలన బ్యాటింగ్తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతుల్లో 6 సిక్స్లు బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది. ఈ టోర్నీ కోసం న్యూయార్క్ నగరంలో కొత్త స్టేడియాన్ని సిద్దం చేస్తున్నారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికవ్వడంపై యువరాజ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'టీ20 ప్రపంచకప్లో నాకు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. 6 బంతుల్లో 6 సిక్స్లు బాధడం ఎప్పటికీ మరిచిపోలేను. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ టోర్నీ అయిన టీ20 ప్రపంచకప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైనందుకు గర్వపడుతున్నాను.
న్యూయార్క్ వేదికగా జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ ఏడాది అతిపెద్ద మ్యాచ్గా నిలుస్తోంది. టీ20 ప్రపంచకప్లో భాగమైనందుకు, కొత్త స్టేడియాల్లో అత్యద్భుతమైన మ్యాచ్లను చూసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా.'అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.