సొంతగడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లోని ఆఖరి మ్యాచ్లో టీమిండియా పింక్ జెర్సీలో బరిలోకి దిగింది. ఇప్పటికే ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో మూడో వన్డే సిరీస్ డిసైడర్గా మారింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా ఫీల్డింగ్కు దిగింది. అయితే టీమిండియా రెగ్యూలర్ బ్లూ జెర్సీలో కాకుండా పింక్ జెర్సీలో ఆడుతోంది.
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించాలానే ఉద్దేశంతో బీసీసీఐ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆసీస్తో ఆఖరి మ్యాచ్లో టీమిండియా పింక్ జెర్సీలో బరిలోకి దిగింది. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు పేసర్ స్నేహ్ రాణా బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ చర్యల గురించి మాట్లాడారు.

'ప్రతిరోజు మనం ఊహించని పరిస్థితుల కోసం శిక్షణ తీసుకుంటాం. అందుకు ఈ జెర్సీ మీరు సిద్ధంగా ఉండాలని గుర్తుచేస్తుంది. రొమ్ముల స్వీయ పరీక్షను నెలవారీ అలవాటుగా చేసుకుని, రొమ్ము క్యాన్సర్ నివారణకు కృషి చేద్దాం.'అని హర్మన్ ప్రీత్ కౌర్ పిలుపునిచ్చింది.
'ఈ పింక్ జెర్సీ కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు. ఇది ప్రాణాలను కాపాడుకునే అలవాటును చేసుకోవాలని సూచిస్తుంది. రొమ్ము క్యాన్సర్కు వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం. జీవితాన్ని నిలబెట్టుకుందాం' అని స్నేహ్ రాణా పేర్కొంది.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. బెత్ మూనీ(75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్స్తో 138) భారీ శతకం బాదగా.. జార్జియో వోల్(81), ఎల్లిస్ పెర్రీ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో 44.3 ఓవర్లలోనే ఆసీస్ 379 పరుగుల భారీ స్కోర్ చేసింది.