
లక్నో: వరుసగా రెండు ఓటములతో ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం ఓదార్పు విజయం కోసం బరిలోకి దిగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్, టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళలు.. ఆఖరి టీ20లో కూడా ఓడితే వైట్వాష్ అవుతుంది. సొంతమైదానంలో ఈ పరిస్థితి తప్పించుకొని పరువైనా కాపాడుకోవాలని భారత మహిళల క్రికెట్ జట్టు భావిస్తోంది. దాంతో సౌతాఫ్రికాతో మంగళవారం జరిగే చివరి, మూడో టీ20లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది.
వన్డే సిరీస్ను 1-4తో కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించింది. గత రెండు మ్యాచ్ల్లో ఓడి 0-2తో సఫారీలకు లీడ్ ఇచ్చేసింది. ఆ టీమ్ చేతిలో తొలిసారి ఓ టీ20 సిరీస్లో ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్నకు ప్రిపరేషన్స్గా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఆడుతున్న అమ్మాయిలు ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. 2017-19 మధ్య అద్భుతంగా ఆడిన క్రికెటర్లు.. ఈ ఏడాది ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ తేలిపోయారు. రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్, అరుంధతి రెడ్డి చెత్త ఫీల్డింగ్ నుంచి బ్యాటింగ్లో దీప్తీ శర్మ వైఫల్యం, తాత్కలిక కెప్టెన్ స్మృతీ మంధాన అనూహ్యమైన కెప్టెన్సీ వరకు ఏదీ కలిసిరావడం లేదు.
హర్లీన్ డియోల్, షెఫాలీ వర్మ రెండు మ్యాచ్ల్లోనూ రాణించినా మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ జట్టును అందుకోలేకపోయారు. గాయంతో సిరీస్కు దూరమైన కెప్టెన్ హర్మన్ప్రీత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్లోనూ స్పిన్నర్లు రాజేశ్వరి, పూనమ్ యాదవ్, ఆల్రౌండర్ దీప్తి తేలిపోగా.. పేసర్లు అరుంధతి, సిమ్రన్ ఆకట్టుకోవడం లేదు. ఈ మ్యాచ్లో గెలిచి వైట్ వాష్ తప్పించుకోవాలంటే మన ప్లేయర్లంతా జట్టుగా రాణించాల్సి ఉంటుంది.