మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. యూఏఈ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకున్న రాధా యాదవ్ సారథ్యంలోని భారత్-ఏ జట్టు దాయాదీ పాకిస్థాన్ను చిత్తు చేసింది. బ్యాంకాంగ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్-ఏ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్-ఏ టీమ్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ 18.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. షవాల్ జుల్ఫికర్(23), గుల్ రుక్(21), అనోషా నాసిర్(17) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత్-ఏ బౌలర్లలో సైమా ఠాకోర్(2/14), రాధా యాదవ్(2/11), ప్రేమ రావత్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. జింతిమని కలితా, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్-ఏ జట్టు 10.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 97 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దినేష్ వ్రిందా(29 బంతుల్లో 12 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. అనుష్క శర్మ(26 బంతుల్లో 4 ఫోర్లతో 24), తేజల్ హసబిన్స్(5 బంతుల్లో ఫోర్, సిక్స్తో 12 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో వాహిదా అక్తర్, మోమినా రియసత్ చెరో వికెట్ తీసారు. ఈ గెలుపుతో భారత్-ఏ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం నేపాల్తో జరిగే మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్ చేరుతుంది.
మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా రెండు గ్రూప్స్ విభజించారు. రెండు గ్రూప్స్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్ను మెరుగైన రన్రేట్తో గెలవాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. ఎందుకంటే గ్రూప్-ఏలో భారత్తో ఉన్న పాకిస్థాన్ ఒక మ్యాచ్ గెలిచి ఒకటి ఓడగా.. యూఏఈ రెండు విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ తమ ఆఖరి మ్యాచ్ను యూఏఈతో ఆడుతోంది.ఈ మ్యాచ్లో పాక్ ఓడి.. నేపాల్పై భారత్ గెలిస్తే సెమీఫైనల్కు దూసుకెళ్తోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మరికొద్ది సేపట్లో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందే భారత్-ఏ మహిళల జట్టు పాకిస్థాన్-ఏ జట్టును ఓడించడంతో ... ఇదే ఫలితం ప్రపంచకప్లో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.