ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా శనివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత మహిళల జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన(55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) విధ్వంసకర అర్థ శతకంతో చెలరేగగా.. శ్రేయాంక పాటిల్(3/22), శ్రీచరణి(3/32) మూడేసి వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. స్మృతి మంధానతో పాటు జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 4 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నబెల్ సదర్లాండ్(2/34) రెండు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, సోఫీ మోలినక్స్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్(3/22), శ్రీచరణి(3/32) మూడేసి వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించారు. అరుంధతి రెడ్డి(2/35) రెండు వికెట్లు తీయగా.. రేణుక సింగ్(1/29) ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ పర్యటనను విజయంతో ప్రారంభించిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు రెండో టీ20లో ఓటమిపాలైంది. కీలకమైన మూడో మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది.
డేంజరస్ బ్యాటర్లు అయిన ఫోబీ లిచ్ఫీల్డ్(26), గ్రేస్ హ్యారిస్(1), కెప్టెన్ సోఫీ మోలినక్స్(6)లను పెవిలియన్ చేర్చిన తెలుగు తేజం శ్రీచరణి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.వన్డే ప్రపంచకప్ 2026 తర్వాత కాస్త ఫామ్ కోల్పోయి తడబడిన శ్రీచరణి.. తన సత్తా ఏంటో చూపించింది. దాంతో ఈ కడప రెడ్డమ్మపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన శ్రీచరణి వన్డే ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో స్టార్ ప్లేయర్గా గుర్తింపు పొందింది. వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణి పేదరికం, కష్టాలు... అన్నిటినీ ఎదురించి స్పూర్తి దాయకంగా మారింది.
శ్రీచరణి చిన్నతనంలో బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్లో ప్రతిభ చూపింది. 16 ఏళ్ల వయసులోనే క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ కోచింగ్.. సహకారం కావాల్సిన వేళ ఆర్దికపరమైన సమస్య లు వెంటాడాయి.
తొలుత నిరాకరించినా.. తరువాత కుటుంబ సభ్యుల నుంచి సహకారం రావటం తో మరింత పట్టుదలతో శ్రీచరణి క్రికెట్ లో శిక్షణ తీసుకున్నారు చరణి మొదట ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందింది. ఫాస్ట్ బౌలింగ్లో వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్ను ప్రయత్నించగా బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్గా మారింది. తన కెరీర్ ప్రారంభించిన రెండేళ్లకే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సెలెక్టర్ల దృష్టిలో పడింది.రూ 55 లక్షల పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. సీనియర్ మహిళల భారత - బీకి ఆడి తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రపంచకప్లో అసాధారణ ప్రదర్శనతో టీమిండియా కీలక ప్లేయర్గా మారింది. అభిమానులు ఆమెను ముద్దుగా కడప రెడ్డమ్మ అని పిలుచుకుంటారు.