ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు మరో ఓటమిని తప్పించుకుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య శనివారం జరిగిన కీలక మూడో వన్డే టై అయ్యింది. ఇరు జట్లు సమంగా స్కోర్లు చేయడంతో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ ఓపెనర్ ఫర్గానా హోక్(160 బంతుల్లో 7 ఫోర్లు 107) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ షమీమా సుల్తానా(78 బంతుల్లో 5 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. దేవికా విద్య ఓ వికెట్ పడగొట్టింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధానా(85 బంతుల్లో 5 ఫోర్లతో 59), హర్లీన్ డియోల్(108 బంతుల్లో 9 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్(45 బంతుల్లో 33 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో టెయిలెండర్లు సహకరించకపోవడంతో భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది.
బంగ్లా బౌలర్లో నహిదా అక్తర్(3/37) మూడు వికెట్లు తీయగా.. మరుషా అక్తర్ రెండు వికెట్లు పడగొట్టింది. సుల్తానా ఖాటున్, రాబెయ ఖాన్, ఫహిమా ఖాటున్ తలో వికెట్ తీసారు.
ఓ దశలో 192 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఓటమి దిశగా సాగింది. కానీ జెమీమా రోడ్రిగ్స్ ఆచితూచి ఆడింది. దీప్తి శర్మ(1), స్నేహ్ రాణా(0), దేవి వైద్య(0) విఫలమైనా.. అమన్జోత్ కౌర్(10), మేఘన సింగ్(6)ల సాయంతో స్కోర్ను సమం చేసింది.
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 3 పరుగులు అవసరమవ్వగా.. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ రాగా.. మూడో బంతికి మేఘన సింగ్ క్యాచ్ ఔట్ అయ్యింది. దాంతో భారత్ విజయవకాశాన్ని చేజార్చుకుంది. మేఘన సింగ్ సింగిల్ తీసినా.. జెమీమానే స్ట్రైక్ ఉంచుకున్నా.. దీప్తి శర్మ బాధ్యాతాయుతంగా ఆడినా భారత్ విజయాన్నందునేది.
ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే మూడు వన్డే సిరీస్ను కైవసం చేసుకునేది. కానీ టై చేసుకోవడంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో వన్డే భారత్ గెలిచిన విషయం తెలిసిందే.