ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ కోసం సిద్దం అవుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీ కోసం భారత జట్టు.. పాకిస్థాన్కు వెళ్లదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ టోర్నీలోని తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దుబాయ్లో లేదా శ్రీలంకలో తమ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీకి ప్రతిపాదించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తామని, మొత్తం 3 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయని పీసీబీ తమ డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి అందజేసింది. వన్డే వరల్డ్ కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి.

టాప్-8లో లేనప్పటికీ పాకిస్థాన్ ఆతిథ్య హోదాలో ఈ టోర్నీ ఆడనుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అలాగే గ్రూప్-బీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి.
గ్రూప్ దశలో టాప్-లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. మార్చి 5, 6వ తేదీల్లో సెమీస్ జరగనున్నాయి. అనంతరం సెమీస్ విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడతాయి. కాగా, గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న న్యూజిలాండ్తో, మార్చి 1న పాకిస్థాన్తో ఆడనుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ లాహోర్ వేదికగా ఆడనుంది. భారత్ నాకౌట్స్ దశకు చేరితే సెమీస్, ఫైనల్స్ కూడా లాహోర్లోనే ఆడనుంది.
అయితే 2008 తర్వాత టీమిండియా..పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు. ఇరుదేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో సత్సంబంధాలు లేవు. ఈ క్రమంలోనే పాకిస్థాన్కు టీమిండియా వెళ్లలేదని, తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ.. ఐసీసీకి ప్రతిపాదించింది. అయితే హైబ్రిడ్ మోడల్కు పీసీబీ ఒప్పుకోవడం లేదు.
టీమిండియాను కాదని ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించలేదు. ఒకవేళ నిర్వహించినా.. సక్సెస్ సాధించలేదు. మరోవైపు భారత జట్టు రాకుండా ఛాంపియన్స్ నిర్వహించడం పాకిస్థాన్కు అన్ని విధాల నష్టమే. బీసీసీఐ పట్టు బడితే పీసీబీ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోవాల్సిందేనని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
'ఛాంపియన్స్ ట్రోఫీ 2024 కోసం టీమిండియా.. పాకిస్థాన్కు వెళ్లదు. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరనుంది. దుబాయ్ లేదా శ్రీలంకలో మ్యాచ్లు పెట్టాలని ప్రతిపాదించనుంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.