
బుక్కెడు బువ్వ కోసం..
జాతీయ వీల్చైర్ క్రికెటర్ అయిన రాజేంద్రసింగ్ ధామి పొట్టకూటి కోసం కూలీగా అవతారమెత్తాడు. ఇన్ని రోజలు ప్రైజ్మనీ, స్పాన్సర్షిప్లు, కోచ్గా పనిచేయగా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించిన ధామి.. కరోనాతో రోజు కూలీగా మారాడు. ఉత్తరాఖండ్లోని రాయ్కోట్కు చెందిన రాజేంద్రసింగ్..ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాళ్లు కొడుతూ రోజులు వెళ్లదీస్తున్నాడు. అయితే ధామి పడుతున్న కష్టాలను మీడియా ద్వారా తెలుసుకున్న భారత ఒలింపిక్ సంఘం రూ.50వేల ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకురాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.20వేలు ప్రకటించింది.

నాకు సాయం అక్కర్లేదు.. కానీ
‘గత మార్చిలో జట్టు కోచ్గా నేను బెంగళూరుకు వెళ్లాల్సింది. కానీ దేశంలో విధించిన లాక్డౌన్తో ఆ టూర్ రద్దవ్వడంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. కుటుంబ పోషణకు కష్టమైంది. దీంతో నేను దినసరి కూలీగా పనిచేయాల్సి వచ్చింది. రాళ్లు కొట్టుకుంటూ రోజుకు రూ.400 సంపాదిస్తున్నాను. ఈ పని చేస్తున్నందుకు నేనేం సిగ్గు పడటం లేదు. రోజుకు రెండు పూటలు తినాలంటే కష్టపడటం తప్పదు. అడుక్కుతినడం కంటే ఇలా చేయడం ఎంతో ఉత్తమం. పని చేయడంలో తప్పేం లేదు. నాకు సాయం చేయకున్నా.. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలి'అని ధామి విజ్ఞప్తి చేశాడు.

రెండేళ్ల వయసులోనే..
ఇక ధామి రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు అతని శరీర కింది భాగంలోని ఎడమవైపు చచ్చుబడిపోయింది. కానీ అతను ఏ మాత్రం కుంగిపోకుండా ఆటలను ఆస్వాదించాడు. క్రికెట్లోకి రాకముందు జాతీయ స్థాయిలో షాట్పుట్, డిస్కస్ త్రోలో మెడల్స్ సాధించాడు. అనంతరం అతనికున్న అపారమైన బ్యాటింగ్ స్కిల్స్తో వీల్ చైర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.


Click it and Unblock the Notifications
