చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు భారత జట్టు తరఫున ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. కొన్ని సిరీస్లకు ఎంపికైనా తుది జట్టులో అవకాశం దక్కలేదు. అవకాశం ఇచ్చినా తర్వాతి సిరీస్ల్లో రుతురాజ్ గైక్వాడ్ను జట్టులో కొనసాగించలేదు. గత మూడేళ్లుగా ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నా... రుతురాజ్ గైక్వాడ్ను భారత సెలెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు.
టాపార్డర్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశాలు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో వారి స్థానాలను భర్తీ చేసే అవకాశం రుతురాజ్ గైక్వాడ్ దక్కుతుందా? అనే చర్చ తెరపైకి వచ్చింది.

ప్రకృతి ఆదేశించింది..
ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కింది. కానీ తుది జట్టులో ఆడుతాడా? అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతనితో పాటు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలు ఈ జట్టుకు ఎంపికయ్యారు. దాంతో రుతురాజ్ గైక్వాడ్ బెంచ్కే పరిమితమవుతాడని అంతా అనుకున్నారు. కానీ ప్రకృతి రుతురాజ్ గైక్వాడ్ను ఆడించే పరిస్థితి తీసుకొచ్చింది.
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంకా స్వదేశానికి రాలేదు. దాంతో ఈ జట్టులో భాగంగా ఉన్న శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్లు.. జింబాబ్వే పర్యటనలోని తొలి రెండు టీ20లకు దూరమయ్యారు. వారి స్థానాల్లో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాను బీసీసీఐ ఎంపిక చేసింది.
తుది జట్టులో చోటు ఖాయం..
ఈ అనూహ్య మార్పుతో రుతురాజ్ గైక్వాడ్కు మార్గం సుగమమైంది. జైస్వాల్ గైర్హాజరీ నేపథ్యంలో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలతో పాటు రుతురాజ్ గైక్వాడ్ టాపార్డర్ బ్యాటర్లుగా తుది జట్టులో ఆడనున్నారు. నాలుగో స్థానంలో రియాన్ పరాగ్, ఐదు, ఆరో స్థానాల్లో రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనున్నారు.
స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, మణికట్టు స్పిన్నర్గా రవిబిష్ణోయ్ ఆడనున్నారు. పేసర్లుగా ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్లు బరిలోకి దిగనున్నారు.
చెలరేగితే తిరుగుండదు..
యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చే వరకు రుతురాజ్ గైక్వాడ్కు పోటీనే లేదు. అతను ఈ రెండు మ్యాచ్ల్లో సత్తా చాటితే సిరీస్ మొత్తం కొనసాగనున్నాడు. ఈ సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబర్చితే జట్టుతో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోనున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా జట్టుకు దూరమైన నేపథ్యంలో బీసీసీఐ టీ20లకు ప్రత్యేకమైన టీమ్ను రెడీ చేయాలనుకుంటుంది.