
ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు:
అరంగేట్ర తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే సైనీ ఆకట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ.. 'సైనీ 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. మ్యాచ్ ఆసాంతం 150 కిలోమీటర్ల వేగంతో బంతులేయడం మాటలు కాదు. వికెట్ నెమ్మదిగా ఉన్నా.. త్వరగా వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏ ఆటగాడికైనా అంతర్జాతీయ మ్యాచ్లో వికెట్లు తీస్తే మరింత ఆత్మవిశ్వాసం వస్తుంది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, భారత్-ఎ మ్యాచ్ల్లో సైనీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు' అని భువీ పేర్కొన్నాడు.

ఆకలితో ఉన్నాడు:
కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సైనీ ప్రదర్శనను మెచ్చుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ... 'బౌలర్లు అందరూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన సైనీ బౌలింగ్ అమోగం. అతడిలో మంచి నైపుణ్యం, ప్రతిభ ఉంది. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తున్నాడు. చాలా ఫిట్గా ఉన్నాడు. తనకంటూ ఒక పేరును సంపాదించాడు. అంతర్జాతీయ స్థాయిలో వికెట్లు తీయాలని ఆకలితో ఉన్నాడు. అతను కెరీర్లో ఇంకా ఎదుగుతాడు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
యువరాజ్ మెరుపులు.. 22 బంతుల్లో అర్ధ సెంచరీ

చివరి ఓవర్ మెయిడిన్:
సైనీ తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటం విశేషం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. చివరి ఓవర్ను సైనీ మెయిడిన్గా వేయడం మరో విశేషం. పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి అతన్ని ఔట్ చేసాడు. మిగతా మూడు బంతులకూ కూడా ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్ వేసాడు.

సైనీ షో:
తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ పర్యటనను టీమిండియా విజయంతో ఆరంభించింది. విండీస్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఛేదనలో రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (19), మనీష్ పాండే (19)లు పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, సునీల్ నరైన్, కీమో పాల్లు తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. సైనీ (3/17) విండీస్ బ్యాట్స్మెన్ను వణికించాడు.


Click it and Unblock the Notifications
